దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట) డిసెంబర్ 3 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి కొండల నడుమ కాంచన గుహలో కొలువైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. కార్తీకమాసం అలాగే సెలవుదినం కావడంతో ఆదివారం భక్తులు పెద్దఎత్తున కురుమూర్తి కొండకు తరలివచ్చారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి నైవేద్యాలు చేసి సమర్పించారు.
దాసరులకు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి దర్శనానికి ముందు స్వామి వారి ఉద్దాలను దర్శించుకొని, ఉద్దాలతో తలపై కొట్టించుకుంటే పీడలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. సోమవారం ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం అలంకరణ తొలగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా మంగళవారం స్వామి వారి హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.