దేవరకద్ర రూరల్, డిసెంబర్ 6: భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలాధారమని జీహెచ్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి జెడీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శాసనసభ, పార్లమెంట్కు మాదిరి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల మాదిరిగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి, పోలింగ్ క్లర్క్, రక్షణ కోసం పోలీస్ సిబ్బంది తదితర ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు బాధ్యతగా మాదిరి పోలింగ్ నిర్వహించారు.
పోలింగ్ను సర్పంచ్ సువర్ణాఅశోక్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయిమమత, ఎంపీటీసీ మనోహర్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మన్నెంగౌడ్ పరిశీలించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన ఎన్నికల సిబ్బంది తీరును అభినందించారు. కార్యక్రమ రూపకర్త, పాఠశాల సాంఘికశాస్త్ర ఉపాధ్యాయురాలు పద్మజ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మాదిరి ఎన్నికల విధానాన్ని నిర్వహించడం వల్ల ఈ ఎన్నికల అంశం విద్యార్థులకు పూర్తిస్థాయిగా అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ ఓటుహక్కు, ఓటు విలువపై విద్యార్థులకు వివరించారు. దేశంలో ఏ ప్రభుత్వం పరిపాలనలో ఉండాలన్నా దానిని శాసించే శక్తి ఓటుకు ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చక్రవర్తిగౌడ్, రవిశంకర్, శ్రీనివాసులు, ఎల్లయ్య, సుశీల, అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు.