పెబ్బేరు, మే 28 : గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వానకాలంలో వినియోగించేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న దోమలను పుట్టుకదశలోనే నిర్మూలించాలని సర్కార్ సంకల్పించింది. నిల్వ నీటిలో గంబుసియా చేపపిల్లలను వదిలితే దోమల గుడ్ల నుంచి వచ్చే లార్వాను తింటాయని, దీంతో దోమలు పుట్టకుండానే వాటిని నివారించొచ్చ ని భావిస్తున్నది. ఈ క్రమంలో పెబ్బేరు, పెద్దమంద డి, మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేప లను పెంచుతున్నారు. ఇందుకు ప్రత్యేకించి ఫిష్పాండ్లను నిర్మించి.. అందులో చేప పిల్లలను వదిలారు.
నెల రోజులకు పైగా నీరు నిల్వ ఉన్న గుంతల్లో సహజంగా దోమలు గుడ్లు పెడుతుంటాయి. ఆ గుడ్లు లార్వా దశ ద్వారా దోమలుగా మారుతాయి. ఇలాంటి ప్రదేశాలను అధికారులు ముందే గుర్తించి.. వాటిలో గంబుసియా చేప పిల్లలను వదులుతారు. అవి లార్వా దశలోని గుడ్లను తినడం ద్వారా దోమల ఉత్పత్తి ఆగిపోతుంది. ముఖ్యంగా వానకాలంలో దోమలను నివారించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. జూన్, జూలై మాసాల్లో వానకాలం ఆరంభం కానుండగా.. ఆగస్టు, సెప్టెంబర్లో అధికారులు చేపపిల్లలను వదిలేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో ఉన్న నీటి గుంతలు, కృష్ణానది పరీవాహక గ్రామాల చుట్టూ ఉన్న రాతి మడుగుల్లో చేప పిల్లలను వదలనున్నారు.
ఫిష్పాండ్లలో గుంబుసియా చేపలను ఒకేసారి వదులుతారు. వీటిల్లో ఆడ, మగ చేపలుంటాయి. దీంతో పునరుత్పత్తి జరుగుతుంది. పుట్టిన చేపపిల్లల సైజు ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల మధ్య ఉంటుంది. గుడ్డు నుంచి దోమగా మారేందుకు పది రోజుల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలోనే చేపపిల్లలను వదిలితే లార్వా దశలోని దోమ పిల్లలను వేటాడి తినేస్తాయి. దీంతో దోమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. దోమల వ్యాప్తి నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. ఇండ్లలో నిల్వ నీటిని పారబోయాలని ప్రతి శుక్రవారం ప్రచారం చేస్తున్నది.
ప్రధానంగా నిల్వ నీటి ద్వారానే దోమల ఉత్పత్తి జరుగుతుంది. నెలల తరబడి నీరు నిలిచి ఉన్న గుంతలు, మడుగులు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో గంబుసియా చేపపిల్లల ద్వారా దోమల ఉత్పత్తిని అరికడుతున్నాం. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరూ దోమల నివారణకు తమ వంతుగా కృషి చేయాలి.
– డాక్టర్ రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి