గద్వాల, జూలై 1 : ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం అన్నారు. శనివారం జిల్లా దవాఖానలోని డయాగ్నొస్టిక్ సెంటర్లో అదనంగా పరీక్షలు నిర్వహించే టీహబ్తోపాటు నూతనంగా దవాఖానలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ యంత్రాన్ని, రూ.94లక్షలతో ఏర్పాటు చేసిన రేడియాలజీ హబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో సర్కా రు దవాఖానకు రావాలంటే ప్రజలకు జంకేవారన్నారు. కాన్పుకు వెళితే తల్లీబిడ్డ తిరిగి క్షేమంగా వస్తారో, రారోఅనే అనుమానంతో ప్రైవేటు దవాఖానకు వెళ్లేవారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైద్యులు, సిబ్బందిని నియమించడంతో పాటు అధునాతన వైద్యశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో కాన్పులు చేసి కేసీఆర్ కిట్తో తల్లీబిడ్డ ఇంటికి చేరే వరకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నదన్నారు. జిల్లా దవాఖానలో ఇప్పటికే ప్రజలకు ఉచిత రోగనిర్ధారణ పరీక్షలు చేయడానికి డయాగ్నొస్టిక్ ఏర్పాటు చేసి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. దీనికి అదనంగా డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా డయాగ్నొస్టిక్ సెంటర్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటిని కలుపుకొని మొత్తం 134 రకాల పరీక్షలు నిర్వహించుకునేలా హబ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ప్రారంభించినట్లు వివరించారు. దీంతోపాటు రోగుల సౌకర్యార్థం దవాఖానలో నూతన జనరేటర్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మంత్రితో మాట్లాడుతూ.. గద్వాల జిల్లా దవాఖానకు సిటీస్కానింగ్ అవసరం ఉందని, మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేయాలని కోరారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న 300 పడకల దవాఖాన నిర్మాణ పనులు, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, జెడ్పీ వైస్చైర్మన్ సరోజమ్మ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, విజయ్కుమార్, జెడ్పీటీసీలు పద్మా వెంకటేశ్వర్రెడ్డి, రాజశేఖర్, ప్రభాకర్రెడ్డి, కౌన్సిలర్లు మురళి, నరహరిగౌడ్, వైద్యాధికారులు కిశోర్కుమార్, నళిని, శృశాలి, పరశురాం పాల్గొన్నారు.