జోగులాంబ గద్వాల : జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ స్థాయి సంఘం గ్రామీణ అభివృద్ధి సమావేశాలు జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ రాజ్ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
అలాగే పల్లెపాడు, బోరవెల్లి రోడ్డు పూర్తి చేయాలన్నారు. అయిజ మండలం మేడికొండ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీటిని అందజేయాలని అధికారులను ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందించేలా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు.
ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామంలో పైపులైన్ సమస్య ఉందని దానిని పూర్తి చేయాలన్నారు. అనేక గ్రామాలలో నీటి ట్యాంకుల నుంచి నీరు వృథాగా పోతుందని, దానిని అరికట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండల సమావేశం లో మినరల్ వాటర్కు బదులుగా మిషన్ భగీరథ నీరు అందజేసేలా ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలన్నారు.
ఉపాధి హామీ పనులపై మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమం అట్టహాసంగా చేస్తున్నారు. ,రోడ్ల పక్కన మొక్కలు సరిగా పెరగడం లేదని, కొన్ని చోట్ల మొక్కలు కాల్చి వేస్తున్నారని, అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు హద్దులు ఏర్పాటు చేసి మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ విజయ నాయక్, డీఆర్డీవో ఉమాదేవి, సంబంధితశాఖ అధికారులు పాల్గొన్నారు.