ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11 : ఆర్టీసీ డ్రైవర్పై టీచర్ దాడి చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇటిక్యాల మండలం కోదండాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు రాణమ్మ రోజూలాగే విధులకు వెళ్లేందుకు ఎర్రవల్లి చౌరస్తా వద్ద కోదండాపూర్ బస్సుకోసం నిలబడింది.
గద్వాల్ నుంచి కర్నూల్ వెళ్లే బస్సురావడంతో తోటి ప్రయాణికులతో బస్సు ఎక్కింది. ఇంతలోనే డ్రైవర్తో గొడవకు దిగింది. కావాలని బస్సు ఆపకుండా ముందుకు తీసుకెళ్లి, పొగలు వచ్చేలా రేస్ చేసాడని వాదించింది. మాటామాట పెరగడంతో రాణమ్మ తన చేతిలో ఉన్న గొడుగుతో డ్రైవర్పై దాడి చేసింది. గొడవ పెద్దది కావడంతో ఎర్రవల్లిలోని అవుట్పోస్ట్ వద్ద ఇరువురు ఫిర్యాదులు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయురాలు రాణమ్మ, డ్రైవర్ గోపాల్ ఇద్దరికి సర్దిచెప్పి పోలీసులు గొడవను సర్దుమనిగించారు.