అదనపు కలెక్టర్ శ్రీహర్ష
గద్వాల, ఫిబ్రవరి 8: జిల్లాలో భూగర్భ జల వనరుల ఆధారంగా జలాశయాలు నిర్మించారని, సమీకృత విధానంతో జిల్లాలో భూగర్భజలాల రీచార్జిని సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన భూగర్భజలాల నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భజలాలు, మైనర్ ఇరిగేషన్, లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జిల్లా అక్విఫర్ మ్యాపింగ్, నిర్వాహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన జలాశయాల మ్యాపింగ్, నిర్వహణ, ప్రణాళిక, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సూచించిన సిఫారసులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, జలశక్తి మంత్రిత్వశాఖ 2012-2013నుంచి దేశం మొత్తానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా జిల్లాలోని భూగర్భజలాల క్షేత్ర పరిస్థితులు, నాణ్యత, పరిమాణం, అందుబాటులో ఉన్న భూగర్భజల వనరుల ఆధారంగా జలాశయాలు నిర్మించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రిత్వశాఖ సూచించిన సిఫారసులను అమలు చేయాలని ఆదేశించారు. అలాగే భూగర్భ జలాల ప్రణాళికలపై సెంట్రల్ గ్రౌండ్ బోర్డు అధికారులు డిజిటల్ స్క్రీన్పై వివరించారు. కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ బోర్డు అధికారులు మాధవ్, విఠల్, డీఆర్డీవో ఉమాదేవి, ఏడీఏ సక్రియనాయక్ తదితరులు పాల్గొన్నారు.
సబ్సెంటర్ నిర్మాణాలు పూర్తి చేయాలి
మల్దకల్, ఫిబ్రవరి 8: గ్రామాల్లో చేపడుతున్న హెల్త్ సబ్సెంటర్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. మండలంలోని పాల్వాయి, విఠలాపురం, ఎల్కూర్ గ్రామాల్లోని హెల్త్ సబ్సెంటర్ల నిర్మాణ పనులను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతుండడంపై పీఆర్ అధికారులు, సర్పంచులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినిత్యం అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈనెల చివరి వరకు పనులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. అలాగే ఉపాధిహామీ కింద సీసీ రోడ్లు మంజూరు కాగా నేటికీ ఎలాంటి పనులు మొదలు పెట్టలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈనెల చివరివరకు సీసీరోడ్ల పనులు పూర్తి చేయించాలని ఎంపీడీవో కృష్ణయ్యను ఆదేశించారు. అనంతరం విఠలాపురంలో వన నర్సరీని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి మనబడి పుస్తకాలను ఎలా బోధిస్తున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాకోబు, మండల కోఆప్షన్ సభ్యుడు హైదర్, ఏఈ భరత్రెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీవో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.