జోగులాంబ గద్వాల : పిల్లల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో వైద్య అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాటశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో( సామ్- మామ్)పోషణ లోపం ఉన్న పిల్లలను ఎలా గుర్తిస్తున్నారని , వారికి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
ఆర్.బి.ఎస్.కె టీంలు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, 2-19 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాలన్నారు. న్యుమోనియా, జ్వరం, వంటి జబ్బులు ఉంటే వారికి అక్కడే మాత్రలు అందించి వైద్యం చేయాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు, కంటి జబ్బులు ఉన్న పిల్లలను ఎన్.ఆర్.సి సెంటర్ లకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
పాఠశాల, మండలం వారీగా ఆనారోగ్యంగా ఉన్న పిల్లలకు అందించే వైద్యం పై ప్రణాళిక తయారు చేసి సబ్మిట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని, ఆశాలు, ఏ.ఎన్.ఎం లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి గ్రామాలలో వంద శాతం వ్యాక్సినేషన్ అయ్యేటట్లు చూడాలని అధికారులకు ఆదేశించారు.
సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, టి.ఎస్.ఎం.ఐ.డి.సి రాఘవ, డాక్టర్ శశి కళ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.