ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 26: రయాల్ గ్రూప్ ఎంటీ-5 యాప్ ద్వారా రూ.15లక్షలు స్వాహా చేసిన సంఘటన ఇటిక్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..ఇటిక్యాల మండలం బట్లదిన్నె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(36) మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. రయాల్ గ్రూప్ సంస్థ ఎంటీ-5 యాప్ ద్వారా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేశారు. రూ.లక్షకు 5శాతం వడ్డీ వస్తుందని ఆశ చూపారు. ఎంటీ-5 యాప్ను ఇన్స్టాల్ చేసి నగదు పంపించమని కోరారు.
వెంకటేశ్వర్లు మొదటిసారి రూ.3లక్షలు వేయడంతో ఎంటీ-5 యాప్ వాలెట్లో రూ.5లక్షలు చూపించింది. రెండో దఫా రూ.2లక్షలు డిపాజిట్ చేయడంతో మొత్తం రూ.7లక్షలకుగానూ, యాప్ వాలెట్లో రూ.10లక్షల బ్యాలెన్స్ చూపించడంతో నమ్మి మొత్తం రూ.14లక్షలు యాప్ ద్వారా చెల్లించాడు. అనంతరం నగదు విత్డ్రా కోసం సదరు కంపెనీ వారికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన రాకపోవడంతో, బాధితుడు వెంకటేశ్వర్లు లబోదిబో మంటూ ఇటిక్యాల పీఎస్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రయాల్ గ్రూప్ ఎంటీ-5 యాప్ సంస్థలపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.