Irkiched : పేద ప్రజలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని కొందరు అక్రమార్తులు నీరుగారుస్తున్నారు. పనులకు రాని వ్యక్తుల పేరిట రూ. లక్షల్లో కాజేస్తున్నారు. కేటిదొడ్డి మండలం పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలో తాజాగా అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ నిధుల ఖర్చులో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆరా తీయగా.. ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరవ్వని వారి పేరిట బిల్లులు వచ్చిన విషయం బయటపడింది.
ఉపాధి హమీ పథకంలో పనులకు వెళ్లిన వారికే బిల్లులు వస్తాయి. కానీ, ఆశ్చర్యంగా పనులకు హాజరవ్వని వారికి సైతం బిల్లులు వచ్చాయనే విషయం తెలిసి ఇర్కిచేడు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. పంచాయతీ నిధులు, ఉపాధి హామీ పథకంలో రూ. లక్షలు కాజేసిన విషయం ప్రస్తుతం మండలంలో కలకలం రేపుతోంది. అలానే హార్టి కల్చర్ సంబంధించిన పనుల్లోనూ అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

గ్రామంలోని కొందరు ఈ అక్రమాలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ఎంపీడీవో రమణా రావును వివరణ కోరగా.. ఉపాధి హామీ పథకంలో అవకతవకల వ్యవహారం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం అని చెప్పారు.