గద్వాల: అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) పరామర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహ విద్యార్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ హాస్టల్లో పుడ్ పాయిజన్ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ నర్సింగరావు తదితరులు విద్యార్థులను పరామర్శించారు.

బీసీ వసతిగృహంలో (BC Hostel) ఆహారం కలుషితమైంది (Food Poison). దీంతో 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకున్నారని, ప్రస్తుతం దవాఖానలో 32 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.