తగ్గిన వరి.. పెరిగిన పల్లీ సాగు
ఇతర పంటల వైపు రైతన్న మొగ్గు
మహబూబ్నగర్ జిల్లాలో తగ్గిన వరి
ఈ ఏడాది 24,118 ఎకరాల్లోనే..
భారీగా వేరుశనగ సాగు పెరుగుదల 20,761 ఎకరాల్లో పంట
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను ముంచెత్తిన పల్లీ
మహబూబ్నగర్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు జిల్లాలో వేరుశ‘నగ’ మెరిసింది. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లను పల్లీరాసులు ముంచెత్తుతున్నాయి. వరి సాగు వద్దు.. లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలన్న ప్రభుత్వసూచనల మేరకు రైతన్న ఇతర పంటల వైపు మొగ్గు చూపారు. దీంతో వరి సాగు బాగా తగ్గింది. గతేడాది 1,21,026 ఎకరాల్లో సాగవగా.. ఈ సారి 24,118 ఎకరాల్లో మాత్రమే సాగైంది. కాగా పల్లీ సాగు మాత్రం గణనీయంగా పెరిగింది. జిల్లాలోసాధారణ విస్తీర్ణం 13,235 ఎకరాలు కాగా గత యాసంగిలో 9,542 ఎకరాల్లో సాగైంది. ఈ సారి రెట్టింపు కంటే ఎక్కువగా 20,761 ఎకరాల్లో సాగైంది. దీంతో వ్యవసాయ అధికారులు చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు. బాదేపల్లి మార్కెట్కు 44,785 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా క్వింటాకు ధర రూ.7,729 లభించింది. మహబూబ్నగర్ మార్కెట్కు 63,457 క్వింటాళ్లు రాగా అత్యధికంగా రూ.7,513 ధరపలికింది.
కేంద్రం ధాన్యం కొనుగోలుకు ససేమిరా అంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు అన్నదాతలు వరికి బదులుగా ఇతర పంటల వైపు మళ్లుతున్నారు. మహబూబ్నగర్ కోయిల్సాగర్, ఎంజీకేఎల్ఐ పరిధిలో ఓ మోస్తరుగా సాగునీటి వనరులు పెరిగాయి. ప్రవహించే వాగులు, వంకలకు చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి నీటికి అడ్డుకట్ట వేయడం వల్ల కూడా భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఫలితంగా వరిసాగు జిల్లాలో ఎక్కువగా నమోదయ్యేది. గత యాసంగిలో 121026 ఎకరాల్లో వరి సాగయ్యింది. కేంద్రం ధాన్యం కొనుగోలుకు వెనకంజ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు నచ్చజెప్పి వరి నుంచి ఇతర పంటల వైపు మళ్లించింది. ఈ తరుణంలో మహబూబ్నగర్ జిల్లాలో గత యాసంగితో పోలిస్తే భారీగా వరి సాగు చేసే రైతుల సంఖ్య తగ్గిపోయింది. ఈ ఏడాది కేవలం 24118 ఎకరాల్లోనే వరి సాగు చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు పల్లిసాగుకు మొగ్గుచూపారు.
తగ్గిన వరి పెరిగిన పల్లి..
అన్నదాతలు వరి సాగు నుంచి ఇతర పంటలవైపు అడుగులేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో 121026 ఎకరాల్లో వరిసాగు చేయగా, ఈ ఏడాది కేవలం 24118 ఎకరాల్లోనే వరి వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పని పరిస్థితుల్లో ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంది. ఈ యాసంగిలో వరిసాగు చేయొద్దని రైతులకు సూచించింది. దీంతో రైతులు వరి సాగు విషయంలో పునరాలోచనకు దిగారు. జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది వరి సాగు 90వేల ఎకరాల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదని అర్థం చేసుకున్న అన్నదాతలు దాదాపుగా వరిసాగు నుంచి దూరమయ్యారు. మరోవైపు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈమారు వరికి బదులుగా వేరుశనగవైపు అన్నదాతలు దృష్టి మళ్లించారు. జిల్లాలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 13,235 ఎకరాలు కాగా గత యాసంగిలో 9,542 ఎకరాలు సాగైంది. ఈ ఏడాది వేరుశనగ సాగు రెట్టింపు కంటే భారీగా పెరిగింది. 20761 ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగు చేశారు. నూనె గింజలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పొచ్చు.
మార్కెట్కు భారీగా ..
మార్కెట్కు వేరుశనగ భారీగా తరలివస్తోంది. గత ఏడాది యాసంగిలో బాదేపల్లి మార్కెట్ యార్డుకు కేవలం 3599 క్వింటాళ్ల సరుకు మాత్రమే రాగా… ఈ ఏడాది ఇప్పటి వరకే 44,785 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. గత ఏడాది బాదేపల్లిలో అత్యధిక ధర క్వింటాకు రూ. 7729 లభించగా… ఈ ఏడాది రూ. 8039 వరకు వచ్చింది. ఇక మహబూబ్ నగర్ మార్కెట్ యార్డుకు వేరుశనగ పోటెత్తుతోంది. గత నెల 15వ తేదీ నుంచి సరుకు రావడం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 63,457 క్వింటాళ్ల వేరుశనగ మార్కెట్కు వచ్చింది. మహబూబ్ నగర్ మార్కెట్ లో అత్యధిక ధర గత నెల 10వ తేదీన రూ. 7513 వచ్చింది. అయితే ధర విషయంలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కనిష్ఠ ధర రూ. 3వేల వరకు ఉండగా గరిష్ఠ ధర రూ.6వేల వరకు ఉంటోంది. వ్యాపారులు సిండికేట్ అయి ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నాణ్యమైన సరుకుతో మంచి ధర
ఈ ఏడాది మార్కెట్ కు వేరుశనగ భారీగా వస్తోంది. మార్కెట్ కు సరుకు తీసుకువచ్చే ముందు రైతులు జాగ్రత్తలు తీసుకునాలి. బాగా ఆరబెట్టిన తర్వాత ఎలాంటి చెత్తచెదారం లేకుండా సరుకు తీసుకురావాలి. ఎండిన సరుకుకు వ్యాపారులు మంచి ధర అందిస్తారు. సరుకు నాణ్యత లేకుండా ఎక్కువ ధర ఆశించే పరిస్థితి ఉండదు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ మార్కెట్ కు 63, 457 క్వింటాళ్లు, బాదేపల్లి మార్కెట్కు 44,785 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. బాదేపల్లిలో క్వింటాకు అత్యధికంగా రూ. 8039 ధర లభించింది. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సరుకు తీసుకువచ్చేముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైన సరుకుకు మంచి ధర లభిస్తుంది.
– సారిక, జిల్లా మార్కెటింగ్ అధికారి, మహబూబ్నగర్
15వరకు వరినాట్లు
ప్రభుత్వం సూచించిన ప్రకారం రైతులు ఈ యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉన్నారు. జిల్లాలో యాసంగిలో సాధారణంగా 47,741 ఎకరాల్లో వరి సాగవ్వాలి. కానీ గత ఏడాది 1,21,026 ఎకరాల్లో వరి సాగయింది. ఈ ఏడాది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ప్రకటించిన తరుణంలో రైతులకు అవగాహన కల్పించాం. ఫలితంగా ఇప్పటి వరకు కేవలం 24,118 ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యింది. ఇంకా ఈ నెల 15వ తేదీ వరకు అడపాదడపా నాట్లు పడనున్నాయి. ఫలితంగా మరో 6వేల ఎకరాల్లో వరి సాగు అవుతుంది. మొత్తంగా ఈ ఏడాది 30వేల ఎకరాలకు మించదు. రైతులు వరికి బదులుగా వేరుశనగ పంటను ఎంచుకున్నారు. జిల్లాలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 13,235 ఎకరాలు కాగా.. గత యాసంగిలో 9542 ఎకరాల్లో మాత్రమే పంట వేశారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు 20761 ఎకరాల్లో వేరుశనగ సాగయింది. గత ఏడాది కంటే రెట్టింపును దాటింది. జిల్లాలో యాసంగిలో 1.35 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉండగా… ఈ ఏడాది 60 నుంచి 70వేల ఎకరాల మధ్య మాత్రమే పంటల సాగు అయ్యే అవకాశం ఉంది. సుమారు 60వేల ఎకరాల వరకు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. ఫలితంగా భూసారం పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. ఫర్టిలైజర్ వాడకం కూడా సగానికి సగం తగ్గనుంది.
– బి.వెంకటేశ్, జిల్లా వ్యవసాయాధికారి, మహబూబ్నగర్