మహబూబ్నగర్, ఫిబ్రవరి 3 : తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని రైతులను మంత్రి అప్యాయంగా పలుకరించారు. యార్డులో వేరుశనగకు ధర ఎలా ఉంది..? అని అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ సేవలు చేయాలని సూచించారు. మార్కెట్లో షెడ్డును పూర్తిస్థాయిలో అన్నదాన సత్రంగా మార్చాలని ఆదేశించారు.
అవసరమైన సదుపాయాలకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చుతామని చెప్పారు. రైతులు యాదార్థంగా కూర్చొని భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి రోజూ 1500 మంది కర్షకులకు అన్నం పెట్టడం గొప్ప విషయమన్నారు. దేశ ప్రజలందరికీ అన్నం పెడుతున్న అన్నదాతలకు ప్రతి రోజూ కడుపు నిండా రుచికరమైన భోజనం అందించాలన్నారు. మహబూబ్నగర్ గ్రేన్స్, సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ యజమానుల సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభు త్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదని చెప్పారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు.
అలాగే అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆర్ట్, కల్చరల్ కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. కళాకారులు అద్భుతంగా నృత్యాలు చేశారని, రాబోయే రోజుల్లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని మంత్రి కాంక్షించారు. కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తద నంతరం మంత్రి అభినందించారు. పాలమూరు ప్రగతి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. మహబూబ్నగర్లో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి క్యాలెండర్ తయారు చేశారన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్, అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కృష్ణయ్య, వ్యవసాయ శాఖాధికారులు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గుర్రపు స్వారీ చేసిన మంత్రి
మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 3 : మహబూబ్నగర్లోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీ, స్విమ్మింగ్ఫూల్ను గురువారం మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుర్రపు బండి ఎక్కడంతోపాటు గుర్రపు స్వారీ చేశారు. హైదరాబాద్ తరహాలో గుర్రపు స్వారీ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్, నర్సింహులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.