రేపు మహాశివరాత్రి
ఉమ్మడి జిల్లాలో ముస్తాబవుతున్న శివాలయాలు
శివదీక్ష.. మోక్షప్రదాయకం
శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
పుష్ప పల్లకీపై భ్రామరీ మల్లికార్జున స్వామి
పాదయాత్రగా మల్లన్న దర్శనానికి స్వాములు
నేటి నుంచి అలంపూర్లో ఉత్సవాలు
నెట్వర్క్ మహబూబ్నగర్, ఫిబ్రవరి 27 ;ఓం నమఃశివాయ.. శివోహం.. వస్తున్నాం మల్లన్నా.. అంటూ పల్లెలు, పట్టణాలు, రహదారుల్లో శివనామస్మరణ మార్మోగిపోతోంది. మంగళవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. మోక్షం సిద్ధిస్తుందని శివ దీక్ష చేపట్టిన స్వాములు రాత్రీ పగలు, ఎండా వేడిని సైతం లెక్కచేయకుండా భక్తిపారవశ్యంతో పాదయాత్రగా మల్లన్న దర్శనానికి వెళ్తున్నారు. కర్ణాటకతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన వస్తుండడంతో రోడ్లన్నీ శివస్వాములతో సందడిగా మారాయి. వీరికి ఆహారం, మందులను ఉచితంగా పలువురు అందిస్తున్నారు. ఎక్కడ చూసినా ఓంకార నాదమే వినిపిస్తున్నది. శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భ్రమరాంబ, మల్లన్న స్వామిని వేలాదిగా భక్తులు దర్శించుకుంటున్నారు.
దీంతో నల్లమల పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత నెలకొన్నది. అలాగే అలంపూర్ ఆలయంలో సోమవారం నుంచి ఉత్సవాలు
ప్రారంభంకానున్నాయి.
శ్రీశైలానికి పాదయాత్రగా..
మహాశివరాత్రి సందర్భంగా వారం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులో ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది. హిందువులందరికీ శివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ. ఉపవాస దీక్షలతో పాటుగా శివాలయాల్లో పూజలు చేసుకొని భక్తిని చాటుకొంటుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రం, పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండోది శ్రీశైలం. శ్రీ భ్రమరాంబదేవికి నెలవైన శక్తిపీఠంగా భాసిల్లుతున్నది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నుంచి 130కిలో మీటర్లు, పాలమూరు నుంచి 180కిలో మీటర్ల దూరంలో క్షేత్రం ఉన్నది. మహాశివరాత్రి పర్వదినాన వేలాది భక్తులు క్షేత్రానికి తరలివెళ్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటుగా కర్ణాటక నుంచి సైతం వేలాది మంది శివరాత్రి వరకు చేరుకునేందుకు పాదయాత్రగా బయలు దేరుతుంటారు. తమతమ ప్రాంతాల నుంచి పండుగ వరకు చేరుకునే రోజులను బట్టి శివ భక్తులు కాలినడకను ఆరంభిస్తారు. ఇలా పది రోజుల ముందు నుంచే కర్ణాటకకు చెందిన శివ భక్తులు పాదయాత్రగా శ్రీశైలం బయలుదేరారు.
మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, జడ్చర్ల, నాగర్కర్నూల్, తదితర ప్రాంతాల నుంచి సైతం శివ స్వాములు ఇరుముడులతో శ్రీశైలం చేరుకొంటున్నారు. గుంపులు, గుంపులుగా పాదయాత్రికులుగా శివనామస్మరణ చేసుకుంటూ వెళ్తుండటంతో మహబూబ్నగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రధాన రహదారి శివ భక్తులతో సందడిగా మారుతోంది. రాత్రీ, పగలు తేడా లేకుండా శివ భక్తులు పాదయాత్రగా బయలుదేరుతుండటం విశేషం. ఓవైపు కాళ్లు, శరీరం నొప్పులు పెడుతున్నా, వాపులు, బొబ్బలు వస్తున్నా, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా, చేతి కర్రను ఊతం చేసుకుంటూ దాదాపుగా 200కిలో మీటర్ల దూరంలోని శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పయనిస్తున్నారు. ఇక శివస్వాముల కోసం ప్రజలు కుల,మతాలకు అతీతంగా అల్పాహారం, భోజనం, పండ్లు అందజేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు రోడ్లు, శివారు ప్రాంతాల్లో టెంట్లు వేసి నీడను, నీళ్లను అందిస్తూ, మరికొందరు మందులు, నొప్పిని తగ్గించే చికిత్సలు చేస్తూ శివ స్వాముల పట్ల తమ ప్రేమను చాటుకొంటున్నారు.
మల్లన్న తోడుతో పాదయాత్ర
మల్లన్న తోడున్నాడన్న నమ్మకంతో ఏండ్ల తరబడిగా పాదయాత్రగా శ్రీశైలం వెళ్తున్నా. మూడేండ్ల నుంచి నా కొడుకు ఉదయ్ సైతం వస్తున్నాడు. కోరిన కోరికలు తీర్చే దేవుడు శివుడు. మా కుటుంబానికి మంచి చేస్తాడనే నమ్మకంతో పాదయాత్రగా వెళ్తున్నాను.
– గోపాల్, ఉల్పోనిపల్లి, హన్వాడ
శివుడిని తల్చుకుంటూ..
శివుడిని తల్చుకుంటే చాలు నొప్పులు, బాధలన్నీ పోతాయి. మేము 20మందితో కలిసి శ్రీశైలం పాదయాత్రగా వెళ్తున్నాం. ఊర్లల్లో ప్రజలు మాకు ఆహారం, మందులు అందిస్తున్నారు. దేవుడే ఇలా వచ్చి మా పాదయాత్రకు సాయం చేస్తున్నాడని నమ్ముతున్నా.
– తిరుపతి, మహబూబ్నగర్
పుష్పపల్లకీలో భోళాశంకరుడు
శ్రీశైలం, ఫిబ్రవరి 27: శ్రీశైలంలోమహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవశక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోది శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఇల కైలాసాన్ని తలపిస్తున్నాయి. భ్రామరి సమేతుడైన శ్రీశైలేశుడు సర్వాలంకరణ భూషితుడై పుష్పపల్లకీలో విహరించారు. చండీశ్వరపూజ మండపారాధన కలశార్చన శివపంచాక్షరీ జపానుష్ఠానాలు రుద్రపారాయణలు రుద్రహోమం చండీహోమం నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. గ్రామోత్సవంలో ఈఈ మురళీ, అసిస్టెంట్ నటరాజ్, ఏఈవోలు ఫణీదర్ ప్రసాద్, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న పాల్గొన్నారు.
నేడు గజ వాహనంపై శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్ర్తోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గజ వాహనంపై భక్తులకు గ్రామోత్సవంలో దర్శనమివ్వనున్నారని ఈవో తెలిపారు.
శ్రీశైలం ఉత్తర ద్వారం.. ఉమామహేశ్వరం
పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారముగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధి గాంచినది. ఉమామహేశ్వర క్షేత్రము నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్గ్రామ పరిధిలో ఉన్నది. పవిత్ర ప్రసిద్ద క్షేత్రమైన రెండో శ్రీశైలముగా పిలవబడుతుంది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రము మహా వైభవముగా ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర వలన తెలియుచున్నది.
ప్రత్యేక పూజలు: శుక్రవారం ఉదయం 5గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అభిషేకం, అర్చనలు నిర్వహిస్తారు. రాత్రి 11గంటలకు లింగోద్భవం, ఒంటి గంటకు పాపనాశనం వరకు పల్లకీసేవ నిర్వహిస్తారు. శనివారం తెల్లవారుజామున పార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తారు.
ఇలా వెళ్లాలి: వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు ఆర్టీసీ బస్సుల్లో నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరకోవాలి. అక్కడి నుంచి అచ్చంపేట మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. అక్కడి నుంచి ఉమామహేశ్వర క్షేత్రానికి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. అచ్చంపేట నుంచి రంగాపూర్ చేరుకొని అక్కడి నుంచి ఉమామహేశ్వరానికి వెళ్లాల్సి ఉంటుంది.