నాగర్కర్నూల్లో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
పాల్గొన్న ఎమ్మెల్యేలు మర్రి, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, గోరటి వెంకన్న
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం జెడ్పీహెచ్ఎస్ నుంచి గాంధీ పార్కు వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ తీశారు. కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులు ఏపీ మల్లయ్య ఆవిష్కరించగా, ఎస్టీఎఫ్ఐ, టీఎస్ యుటీఎఫ్ పతాకాలను లక్ష్మయ్య, సత్యనారాయణరెడ్డి ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన ప్రారంభమైన సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు అబ్ధుల్లాఖాన్ స్వాగతోపన్యాసం చేస్తూ నల్లమల అడవులతో కృష్ణానది పరవళ్లతో భిన్న సంస్కృతులతో సాహితీ సంపత్తులతో నాగర్కర్నూల్ ప్రాంతం విశిష్టతను సంతరించుకుందని జిల్లా చరిత్రను వివరించారు.
‘మన ఊరు-మనబడి’ని స్వాగతిస్తున్నాం ; ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడి’ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని, విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. అందరికీ సమానమైన విద్య అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మన ఊరు-మనబడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం 9,123 పాఠశాలలకు మెరుగులు దిద్దడంతోపాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధికి కేటాయించిన రూ.7,289 కోట్లను సద్వినియోగమయ్యేలా ప్రతి టీఎస్ యూటీఎఫ్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తర్వాత ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు మోతుకూరి సంయుక్త, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, కవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, డీఈవో గోవిందరాజులు మాట్లాడుతూ శాస్త్రీయ దృకృథంతోనే కుల మతాల గోడలను కూల్చవచ్చన్నారు.
ఉపాధ్యాయులు చరిత్రను అధ్యయనం చేయాలని, ప్రశ్నించడం ద్వారానే శాస్త్రీయ దృక్పథం,అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన రీడ్ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని అందరికీ అందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువుకు తగిన ప్రాధాన్యం ఉన్నప్పుడే విజ్ఞానం వెల్లివిరుస్తుందని, 317 జీవో వల్ల జరిగిన నష్టాన్ని శాసన సభలో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే జైపాయల్యాదవ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ రాములు, చావ దుర్గాభవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి రాష్ట్ర కార్యదర్శులు నర్సింహారావు, వెంకటి, రాజశేఖర్రెడ్డి, శాంతికుమారి, శారద, సత్యానంద్, గాలయ్య, నాగమణి, రవిప్రసాద్గౌడ్, రవికుమార్, రాజు, పత్రికా సంపాదకుడు మాణిక్రెడ్డి, ఎస్వీ కొండల్రావు, ఎంకే దల్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వహీద్ఖాన్, శ్రీధర్శర్మ, కమిటీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.