గట్టు, మార్చి 28: కొత్త లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీవీ నర్సింహ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాషా డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐఎఫ్టీయూ, సీఐటీయూల ఆధ్వర్యంలో నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తాసిల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్మద, రాజు, బండారి ప్రకాశ్, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
వడ్డేపల్లి మండలంలో..
సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతినగర్లో సోమవారం సమ్మె చేపట్టి డిమాండ్లను వినిపించారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పరంజ్యోతి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు, ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ యాక్ట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి కార్తీక్ అధ్యక్షతన ఒంటికాలిపై నిలబడి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఆశ వర్కర్లు, మున్సిపల్, గ్రామ పంచాయతీ వర్కర్లు, కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, మధు, శ్రీను, కల్యాణ్, సోమన్న, తిమ్మప్ప, లవన్న, రవి, రాజు, మద్దిలేటి పాల్గొన్నారు.
కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నర్సింహులు, ఉప్పేర్ నర్సింహ, కృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.
మొదటి రోజు సమ్మె సక్సెస్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సార్వత్రిక సమ్మెను మొదటి రోజు కార్మికులు సక్సెస్ చేశారు. సోమవారం పట్టణంలోని కార్మికులు, కార్మిక సంఘాలు, రైతులు కలిసి ర్యాలీ నిర్వహించి, తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, ఐటీయుసీ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. అనంతరం తాసిల్దార్ యాదగిరికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి శ్రీనివాసులు, హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వర్, మున్సిపల్ యూనియన్ నాయకులు నరేశ్, పార్వతమ్మ, మహేంద్రనాథ్, బీఆర్ఎస్ నాయకులు వినోద్కుమార్, నాగరాజు, భీమన్న, ఆంజనేయులు, మల్లేశ్, మహేశ్, నాగన్న, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మె విజయవంతం
పట్టణంలో సీఐటీయూ జిల్లా నాయకులు నర్సింహ, పెద్దబాబు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎంగడుతూ సమ్మెను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.
ఉండవెల్లి మండలంలో..
మండలంలో సార్వత్రిక సమ్మె మొదటి రోజు విజయవంతమైనట్లు సీఐటీయూ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి అంగన్వాడీ, ఆశకార్యకర్తలు, హమాలీలు ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ వీరభద్రప్పకు అందజేశారు.