గద్వాలటౌన్, మార్చి 1: ఊరు.. వాడ.. శైవక్షేత్రమైంది.. ప్రతిగొంతూ శివనామం జపించింది.. ప్రతిపాదం హరుడి ఆలయం వైపు కదిలింది.. హరహర శంకర శంభో అంటూ శైవక్షేత్రాలు మారుమోగాయి. జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ భక్తజనసంద్రమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా సర్వేశ్వరుడిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. అభిషేకాలు చేశారు. చల్లంగా చూడమని వేడుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన భోలాశంకరుడుని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలుగుపేట శివాలయం, రాజవీధి మార్కండేయ స్వామి, గంజిపేట వేంకటేశ్వరస్వామి, నల్లకుంట శివాలయం, రెండో రైల్వేగేట్ నందీశ్వరాలయం, జూరాల రోడ్డులోని అడివేశ్వరస్వామి ఆలయాలతోపాటు వివిధ శైవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
నదిలో స్నానమాచరించిన భక్తులు
నదీఅగ్రహారాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న కృష్ణానదిలో శివరాత్రిని పురస్కరించుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. నదీతీరాన కొలువుదీరిన శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. నదీఅగ్రహారంలోని స్పటిక లింగేశ్వరస్వామికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు చేశారు. శ్రీపూర్ణకృష్ణవేణి నదీహారతి సమితి ఆధ్వర్యంలో నదీమధ్యలో కొలువుదీరిన పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు నదీహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు వాయనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
సంగాల పార్కు శివమయం
జిల్లా కేంద్రంలోని చెన్నకేశవ సంగాల పార్కులో ఏర్పాటు చేసిన 14అడుగుల ఎత్తయిన మహాశివుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, క్షీరాభిషేకం చేశారు. పార్కులో 14అడుగుల ఎత్తయిన మహాశివుడి విగ్రహాన్ని శివరాత్రి రోజు ప్రతిష్ఠించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, శ్రీను, నరహరిగౌడ్, దౌలు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తాలో..
ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తాలోని శివాలయం శివనామస్మరణతో మారుమోగింది. సర్పంచ్ రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లోకారెడ్డి, సరస్వతి, పరశురాముడు, ఆలయ అర్చకుడు వినోద్ తదితరులు ఉన్నారు.
జములమ్మ అమ్మవారి సన్నిధిలో..
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారిని భక్తులు మంగళవారం అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. తెల్లవారుజామునుంచే క్యూలైన్లో బారులుదీరారు. అలాగే జములమ్మ అమ్మవారిని రాయిచూర్ జేసీ దుర్గేశ్ దంపతులు శివరాత్రి సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మల్దకల్ మండలంలో..
మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ప్రజలు మంగళవారం శివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని శివాలయం, మల్లెందొడ్డి, బిజ్వారం, అమరవాయి శివాలయాలు, పాల్వాయి అడవి శివాంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వులో సీతారామాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరవాయి, బిజ్వారంలో శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అమరవాయి వీరభద్రస్వామి ఆలయంలో టీఆర్ఎస్ నాయకుడు తూంకృష్ణారెడ్డి దంపతులు, వెంకటేశ్వర్రెడ్డి దంపతులు స్వామివారి కల్యాణం చేయించారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్దగోపాల్రెడ్డి, పాండురంగారెడ్డి, విక్రంసింహారెడ్డి, నల్లన్న, గోపాల్, ఆంజనేయులు, తిమ్మారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
గట్టు మండలంలో..
మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో భక్తులు శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలను చేపట్టారు. వీరభద్రస్వామి, బస్టాండు ఆవరణలోని శివాలయం, కుర్వంజమ్మ ఆలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చేశారు. అదేవిధంగా బంగారు బస్సప్ప, తోటరామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ఉత్సవాలను నిర్వహించారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
మండలంలోని వివిధ గ్రామాల ప్రధాన ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వెంకటాపురం వేంకటేశ్వర స్వామి, మండల కేంద్రంలోని శివాలయం, నందిన్నె మల్లికార్జున ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పాగుంట వేంకటేశ్వరస్వామి ఆలయానికి కర్ణాటక నుంచి భక్తులు పాదయాత్రగా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉండవెల్లి మండలంలో..
మండలంలోని తక్కశిల, ఉండవెల్లి, పుల్లూరు, బైరాపురం, ప్రాగటూర్, బొంకురు, ఇటిక్యాలపాడులో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివుడికి పంచామృతాలతో అభిషేకం, అర్చనలు చేశారు. ఆలయాలల్లో భక్తుల సందడి నెలకొన్నది.
ముక్కంటీశుడికి ప్రత్యేక పూజలు
మున్సిపాలిటీలోని భ్రమరాంబిక, గుంత రామలింగేశ్వరాలయం, మిట్ట లింగేశ్వరాలయం, నీలకంఠేశ్వరాలయం, బోయపేటలోని శివాలయం, వల్లూరు పేటలోని శివాలయం, తిక్కవీరేశ్వర స్వామి, కట్టకింద తిమ్మప్ప, పర్దీపురంలోని శివాలయం, తుప్రత్రాల శివాలయం, ఆంజనేయస్వామి, వీరబ్రహ్మేంద్ర శివరామాలయాలకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి శివపార్వతుల కల్యాణం జరిపించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని ఉత్తనూరు భీమలింగేశ్వర, పులికల్లోని రామలింగేశ్వర, సింధనూరులోని శివ రామాంజనేయస్వామి, ఉప్పలలోని రామలింగేశ్వర ఆలయాల్లో రాత్రి శివపార్వతుల కల్యాణం జరిపించేందుకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు. పులికల్లో శివసార్వతుల ఉత్సవమూర్తులను భాజాబజంత్రీలు, భజన బృందాలు, చిన్నారుల కోలాటాల ప్రదర్శన, భక్తుల శివనామస్మరణల నడుమ ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అయిజ మండలంలో..
మండలంలో సంకాపురం, ఈడిగోనిపల్లి, బింగిదొడ్డి, చిన్నతాండ్రపాడు, యాపదిన్నె, తూంకుంట, వేణిసోంపురం, వెంకటాపురం, ఎక్లాస్పురం తదితర గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సంకాపురంలో వెలిసిన భవానీచంద్రశేఖరస్వామి ఆలయంలో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరమశివుడికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు గణేశ్ఆచారి నదీజలాలతో అభిషేకించి అర్చన, హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
బీచుపల్లిలో పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బీచుపల్లి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించి పుష్కరఘాట్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవసమేత జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయం, కోదండరామాలయం, ఆంజేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇటిక్యాల ఎస్సై గోకారి సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మండలంలోని శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు.
మానవపాడు మండలంలో..
మండల కేంద్రంలోని పాత శివాలయం, ఊరిబయట పరమేశ్వర ఆలయం, బోరవెల్లి, జల్లాపురం, పలెల్పాడు, అమరవాయి, కలుకుంట్ల, కొర్విపాడు, మద్దూరులోని అతిపురతాన ఆలయంలో పూజలు నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని కొంతమంది భక్తులు ఉపవాసాలు చేశారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
కనులపండువగా శివపార్వతుల కల్యాణం
శివరాత్రి పండుగను పురస్కరించుకుని రాజోళిలో శివపార్వతుల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. రాజోళిలోని భ్రమరాంబ, అడివేశ్వరస్వామి, తుమ్మలపల్లె రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, అష్టోత్తరాలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శివరాత్రి జాగరణ సందర్భంగా భక్తులు భజన గీతాలు, సంకీర్తనలతో స్వామివారి సేవలో తరించారు.
రాఘవేంద్రస్వామి మఠంలో రుద్రాభిషేకం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పరమశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. మంగళవారం మహా శివరాత్రిని పురస్కరించుకుని వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ పీఠాధిపతి శివుడికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం చేశారు. కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు, పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
జిల్లా కేంద్రంలోని నల్లకుంట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు సంజీవ్శర్మ పేర్కొన్నారు. ఉదయం 5గంటల నుంచే శివుడికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొన్నారు.