అలంపూర్, మార్చి 1 : అలంపూర్ క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, కోటి లింగాల, సంగమేశ్వర, పాపనాశిని, కోదండ, ఝాంకారేశ్వకరి గుందిమల్ల, వాసవీ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భోళా శంకరుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగోద్భవ కాలం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున జోగుళాంబ ఆలయం ఎదుట ఉన్న రాజగోపురం పరిసరాల్లో ఆదిదంపతుల కల్యాణం కనులపండువగా జరిగింది. ఈ వేడుకను తిలకించిన భక్తులు పులకించిపోయారు. అలంపూర్ చౌరస్తాలోని ఆలయ ముఖ ద్వారాన్ని, క్షేత్రంలోని ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.
ప్రత్యేక ఆకర్షణగా ఆకాశ జ్యోతి..
బాలబ్రహ్మేశ్వర ఆలయంపై భాగంలో శివస్వాములచే ఆకాశ జ్యోతి కార్యక్రమం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జ్యోతి దర్శనం కోసం ఆలయ పరిసరాల్లో భక్తులు, స్వాములు పోటెత్తారు. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆల యం శిఖర భాగం నుంచి ఆకాశ జ్యోతిని ఎగురవేశారు. జ్యోతిని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. జ్యోతి ఆకాశ మార్గాన వెళ్తుంటే భక్తులు జేజేలు పలికారు. ఈ సందర్భంగా ఓం నమఃశివాయ నామస్మరణ మార్మోగింది. అంతకుముందు పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళ తాళా లు, నందికోళ్ల సేవల మధ్య వందలాదిగా తరలివచ్చిన మహిళలు, శివస్వాములు, భక్తు లు జ్యోతిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్వా ములు మాల విరమించారు. దుస్తులు, తలనీలాలు సమర్పించుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీతోపాటు పలు రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు జాగారం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నేత్ర పర్వంగా కల్యాణోత్సవం..
తెల్లవారు జామున 2 గంటలకు ఆది దంపతులైన పార్వతీ, పరమేశ్వర కల్యాణం వైభవంగా జరిగింది. జోగుళాంబ ఆలయ రాజ గోపురం ప్రాంగణంలో అలంకరించిన మండపంపై కల్యాణ ఘట్టం నిర్వహించారు. భక్తులు తిలకించి పులకించిపోయారు. అనంతరం నాగకన్యల బావి వద్ద జోగుళాంబ సమేత బాలబ్రహ్మేశ్వరులకు సేవా స మితి సభ్యులు, భక్తులు బావి నుంచి తీసిన జలాలతో అభిషేకాలు చేశారు. కార్యక్రమా ల్లో ఆలయ ఈవో పురేందర్ కుమార్, పుర ప్రముఖులు, భక్తులు, జోగుళాంబ సేవా సమితి సభ్యులు బండారి వెంకన్నబాబు, బండారి శ్రీనివాసులు, ఆనంద్ శర్మ, సంజీవ నాయుడు, భక్తులు పాల్గొన్నారు.