గద్వాల, నవంబర్ 29: మహబూబ్నగర్-గద్వాల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తికావడంతో విద్యుత్ రైళ్ల రాకపోకలను రైల్వేశాఖ ప్రారంభించింది. 2022 ఏప్రిల్-నవంబర్లో భారతీయ రైల్వేలోని మిగతా జోన్లతో పోలిస్తే దక్షిణమధ్య రైల్వే అత్యధికంగా విద్యుద్దీకరణ రైల్వేలైన్లు పూర్తిచేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే విద్యుద్దీకరణకు పెద్దపీట వేస్తూ మహబూబ్నగర్-గద్వాల మధ్య 72.7కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు పూర్తిచేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 385కిలోమీటర్లు పనులు పూర్తిచేశారు. డోన్-కర్నూల్సిటీ, మహబూబ్నగర్, సికింద్రాబాద్, ముడ్ఖేడ్, మన్మాడ్ విద్యుద్దీకరణలో భాగంగా మహబూబ్నగర్-గద్వాల స్టేషన్ల మధ్య విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు 2015-16లో 783కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణకు రూ.900కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య విద్యుద్ధీకరణ ప్రత్యేక ప్రాజెక్టుగా మంజూరు చేసి పనులు పూర్తిచేశారు.
గద్వాల-రాయచూర్ విభాగం మధ్య ఇప్పటికే రైల్వేలైన్లు విద్యుద్దీకరించబడిన సంగతి విదితమే. రైలు మార్గాల విద్యుద్దీకరణ వల్ల రైలు ఇంజన్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ మార్గాల్లో ఆటంకం లేకుండా రైళ్లు సజావుగా నడిచేందుకు వీలుంది. విద్యుద్దీకరణ పనులను అమలుచేయడంలో అంకితభావంతో పనిచేసిన ఎలక్ట్రికల్ విభాగం అధికారులను, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే మేనేజర్ అరుణ్కుమార్జైన్ అభినందించారు.