మల్దకల్, జూన్ 15: హరితహారంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈవో విజయనాయక్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశం హాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే గ్రామాలకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం గుంతలు తవ్వించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడంలో అలస్వతం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వానకాలం వస్తుందని వర్షాలు కురిస్తే వర్షపునీరు గ్రామాల్లోని వీధుల్లో నిల్వ ఉండకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. వారానికోసారి వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆనంతరం మల్దకల్లోని పల్లె ప్రకృతివనంను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, సూపరింటెండెంట్ నర్సన్న, ఏపీవో స్వామి, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
హరితహారం పనుల పరిశీలన
మండలంలోని కంచుపాడు జాతీయ రహదారిపై చేపడుతున్న హరితహారం పనులను జెడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రతి కుటుంబానికి ఉపాధిహామీ పథకం ద్వారా పని కల్పించి వలసలను నివారించడం జరుగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నదన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి గుంతల పనులు త్వరగా పూర్తి చేయలన్నారు.