జోగులాంబ గద్వాల : భూ సమస్యను పరిష్కరించాలంటూ తహసీల్ కార్యాలయం (Mandal Revenue Office) లో మహిళా బాధితులు పెట్రోల్తో హల్చల్ చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో పాటు తహసీల్దార్పై కూడా పోసి కలకలం సృష్టించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
అయిజ మండలం, బింగిదొడ్డి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 139 శివారులో 10 ఎకరాల భూమిని తమ రికార్డులో ఎక్కించాలంటూ జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) పట్టణానికి చెందిన ఐదుగురు మహిళ బాధితులు రామేశ్వరమ్మ, సుభద్రమ్మ, గోవిందమ్మ, లక్ష్మీదేవి, రోహిణమ్మ ఆరేళ్లుగా తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
పది ఎకరాల భూమి ప్రభుత్వా్ని(Government Land) కి చెందినదని, ఈ భూమి సాగులో లేనందువల్ల గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూలుకు కెటాయించిందని తహసీల్దార్ జ్యోతి బాధితులకు వివరించారు. ఆ భూమిని తమ పేరుతో రికార్డులో ఎక్కించాలంటూ మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగారు.
తాను 15 రోజుల క్రితమే తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నానని , విచారణ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పారు. బాధిత మహిళలు కోపంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ను తహసీల్దార్పై చల్లి వారు కూడా ఒంటిపై పోసుకున్నారు.కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఎస్సై విజయభాస్కర్ కేసు నమోదు చేసి బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. జరిగిన విషయం జిల్లా కలెక్టర్ సంతోష్ కు తెలియజేస్తానని తహసీల్దార్ వెల్లడించారు.