వ్యవసాయంపైనే ఆధారపడిన జీవన విధానం
ప్రకృతి సాగు ఆదాయంతోపాటు ఆరోగ్యాన్నిస్తుంది
రైతు దినోత్సవాన్ని నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి రూరల్, ఫిబ్రవరి 27 :సమీకృత సాగు దిశగా రైతులు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించినరాష్ట్ర స్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. 3,500 ఏండ్ల కిందటి నుంచేదేశంలో వ్యవసాయం జీవనాధారంగాసాగుతుందన్నారు. వ్యవసాయరంగ అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఏడాదికి దాదాపురూ.60 వేల కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుకుప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు.రాష్ట్రంలోని రైతులు తల ఎత్తుకుని జీవిస్తున్నారన్నారు.
సమీకృత సాగుపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 3,500 ఏండ్ల కిందటి నుంచే మన దేశంలో వ్యవసాయం జీవనాధారంగా సాగుతున్నదన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సుస్థిర వ్యవసాయ రైతు చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంబంధిత స్టాల్స్ను నిర్వాహకుడు గున్న రాజేందర్రెడ్డితో కలిసి తిలకించారు. అంతకుముందు ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు, మేధావులు, ప్రజాప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహకారాలనుద్దేశించి మాట్లాడారు. అలాగే కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా ఆదర్శ రైతు దంపతులను నిర్వాహకులతో కలిసి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ సాగుకు అనుకూలమైన వనరులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కరువు తీరగా సాగునీరు, విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.
ఇక్కడి రైతులు తలెత్తుకుని జీవిస్తున్నారన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారినప్పుడే కర్షకులకు నిజమైన ఆనందమన్నారు. దేశంలో అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయమే అన్నారు. వ్యవసాయరంగ అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఏడాదికి దాదాపు రూ.60 వేల కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ప్రజల అవసరాలకు తగ్గ పంటలైన కందులు, నూనె గింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. వంటనూనెల కోసం దాదాపు రూ.80 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి పోవాలంటే పప్పు, నూనె గింజల సాగు పెంచాలని సూచించారు. అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పత్తుల దిగుబడుల కోసం నూతన వంగడాలు వచ్చాయన్నారు. భూమిని సారవంతం చేసే దిశగా ప్రభుత్వం పచ్చిరొట్ట, పిల్లి పెసర ఎరువులను ప్రోత్సహిస్తుందని వివరించారు. పురుగు మందు వినియోగం తగ్గించేందుకు జర్మనీలో రైతులకు నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు, మనదేశంలో కూడా రైతులను చైతన్యం చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 25 వేలకుపైగా ఇండ్లల్లో మిద్దెతోటలను ప్రోత్సహించి సాగు చేయిస్తున్నారని తెలిపారు. రైతులతోపాటు, వ్యవసాయ శాస్త్రవేత్త సైదయ్యకు మంత్రి జ్ఞాపికను అందజేశారు.
పోలియో చుక్కలు వేసిన మంత్రి
చిన్నారుల బంగారు భవిష్యత్కు పల్స్ పోలియో ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా దవాఖానలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, డీఎంహెచ్వో చందూనాయక్తో కలిసి చిన్నారులకు చుక్కల మందును వేశారు. అలాగే బాలింతలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. అలాగే వెంకటసాయి దవాఖానలో ఇండియన్ పోడియాట్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వాన్స్డ్ డయాబెటిక్ పుట్ కేర్ వర్క్ షాప్ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి. కేవై రామచందర్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ జగదీశ్వర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, విండో చైర్మన్ వెంకట్రావు, మధుసూదన్రెడ్డి, విజయ్కుమార్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, శాస్త్రవేతలు పాల్గొన్నారు.
ధర్మపథంలో నడవాలి
వనపర్తి, ఫిబ్రవరి 27: ప్రపంచశాంతి ధ్యేయంగా పని చేస్తున్న ప్రజాపిత బ్రహ్మకుమారీలు సేవలు ఎనలేనివని, మనుషులంతా ధర్మం వైపు నడవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు, లక్ష్మీకుంట పనులను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి పట్టణం చుట్టూ ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించామని, పట్టణంలో వేగవంతంగా జరుగుతున్న పనులను ప్రజలు పరిశీలించాలని మంత్రి సూచించారు. పట్టణం సుందరంగా ఉండాలంటే ముందుగా ఇండ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా తమ వంతు బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రజాపిత బ్రహ్మకుమారీలు నిర్వహిస్తున్న 86వ త్రిమూర్తి శివజయంతి, శివరాత్రి మహోత్సవాలకు మంత్రి నిరంజన్రెడ్డి హాజరై శివలింగానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని బ్రహ్మకుమారీలు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ బండారు కృష్ణ, మాజీ కౌన్సిలర్ తిరుమల్, నాయకులు జోహెబ్, మురళి తదితరులు పాల్గొన్నారు.