ధన్వాడ నుంచి పాతపల్లి రోడ్డుకు నిధులు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ధన్వాడ, ఫిబ్రవరి 6: సార్ మా రోడ్డు బాగలేదు…నడవాడానికి రాదు…వానకాలం వచ్చిదంటే మాకు తిప్పలు తప్పవు…ధన్వాడకు విద్యార్థులు రావాలంటేనే చాలా కష్టంగా ఉన్నది…ఎలాగైనా రోడ్డు మరమ్మతులకు నిధులు మంజురు చేయాలంటూ పాతపల్లి, ధన్వాడ ప్రజలు ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డికి విన్నవించారు. స్పందించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ధన్వాడ నుంచి పాతపల్లివరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేశారు. ఈ రోడ్డు ఆధ్వాన్న స్థితికి చేరుకొని నెలలు గడిచాయి. ద్విచక్ర వాహనం సైతం నడవలేని పరిస్థితి నెలకొన్నది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ప్రస్తుతం రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు కావడంతో త్వరలోనే రోడ్డు బాగవుతుందన్న సంతోషం మండల ప్రజల్లో వ్యక్తమవుతున్నది. మంజూరైన నిధుల్లో ధన్వాడ మెయిన్ రోడ్డు నుంచి కారం బావి వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం, ఆ తర్వాత అంతా బీటీగా మార్చడం జరుగుతుందని అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పాతపల్లి గ్రామం ధన్వాడ మండలంలోనే ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు మక్తల్ పరిధిలోకి వస్తారు. ఇటు నారాయణపేట ఎమ్మెల్యే అటు మక్తల్ ఎమ్మెల్యే ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజురు చేయించారు. ధన్వాడ నుంచి పాతపల్లి మీదుగా బిజ్వార్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతామన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ధన్వాడ, ఊట్కూర్, మక్తల్ మండలాలకు రాకపోకలు సమస్య తీరుతుందని మండల ప్రజ లు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల సహకారంతోనే…
ధన్వాడ నుంచి పాతపల్లికి వెళ్ల్లే రహదారి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే మూడు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడు తుంది. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సహకారంతో నిధులు మంజూరు కావడంతో తమ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చే స్తున్నారు.
నిధుల మంజూరు హర్షణీయం
ధన్వాడ నుంచి పాతపల్లికి వెళ్లే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు కావడం చాల సంతోషంగా ఉంది. నిధులు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. రోడ్డు బాగా లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నది. నిధులు మంజురు కావడంతో రోడ్డు సమస్య తీరనుంది.
– గాజుల నారాయణస్వామి,టీఆర్ఎస్ మండల కోశాధికారి, ధన్వాడ