జోగులాంబ గద్వాల : ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో అటవీ శాఖ అధ్వర్యంలో జెడ్పీ చైర్ పర్సన్, స్థానిక శాసన సభ్యుడు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే డా. అబ్రహం సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అటవీ సంరక్షణ, పోడు భూములపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయి లో బీట్ ఆఫీసర్ లు కమిటీ ఏర్పాటు చేసుకొని సమావేశాలు నిర్వహించి అటవీ సంరక్షణ పై చర్చించాలన్నారు. గ్రామ, మండల , డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అందులో అటవీ, గిరిజన, రెవిన్యూ శాఖల నుంచి సభ్యులు ఉంటారని, గ్రామాలలో ప్రజలకు అడవుల సంరక్షణ పై అవగాహన కల్పించాలన్నారు.
2005 కంటే ముందు 75 సంవత్సరాలుగా నివాసము ఉంటున్న గిరిజనులు ఆధారాలు (ఓటర్ కార్డు, ఆదార్ కార్డు) తీసుకొని, గ్రామ సభలో అర్జీ చేసుకోవచ్చని, గిరిజనులు కాని వారు సైతం అర్హులని అన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ సరోజమ్మ, అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష, ఆర్డీవో రాములు, జడ్పీ సీఈవో విజయ నాయక్, అధికారులు పాల్గొన్నారు.