జోగులాంబ గద్వాల : రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం కేటీ దొడ్డి మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఎరువుల సంచులను తగలబెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఓవైపు తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తూ రైతుబంధు, ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ధరలు పెంచడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని రైతుల పై కేంద్రం వివక్ష చూపు తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోగా ఎరువుల ధరలు పెంచి రైతులు ఆర్థికంగా బలహీనపరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ఇవ్వకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇలాగే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నాలో జడ్పిటిసి రాజశేఖర్, ఎంపీపీ మనోరమ, రైతులు పాల్గొన్నారు.