అయిజ, ఫిబ్రవరి 8: మండలంలోని ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న పశుబల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం పశుబల ప్రదర్శన పోటీలను ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల నుంచి తరలివచ్చిన 8 జతల వృషరాజములు పోటీల్లో పాల్గొన్నాయి. మంగళవారం సబ్ జూనియర్ విభాగం పశుబల ప్రదర్శన పోటీలు ఆసక్తికరంగా సాగాయి. న్యూకేటగిరీ విభాగం పశుబల ప్రదర్శన పోటీల్లో విజేతలను దేవస్థాన కమిటీ ప్రకటించింది. గట్టు మండలం హిందువాసికి చెందిన రమేశ్నాయుడు వృషభరాజములు 5,387 అడుగుల దూరంలాగి మొదటి స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లాలోని నాదర్గోల్కు చెందిన ప్రసన్నరెడ్డి వృషభరాజములు 5,239 అడుగులు, మూడో స్థానంలో గుంటూరు జిల్లాలోని వేటపాలెం శిరీష, శివకృష్ణల వృసభరాజములు 5,100 అడుగులు, నాలుగో స్థానంలో అదే జిల్లాలోని కొప్పురావూరుకు చెందిన తోట శ్రీనివాసరావు వృషభరాజములు (అఖండ) 4,996 అడుగులు, ఐదో స్థానంలో గుంటూరు జిల్లాలోని చుండూరుకు చెందిన శిరీష, శివకృష్ణచౌదరి, నాగర్కర్నూల్ జిల్లా, తాడూరు మండలంలోని అఖిలేశ్రెడ్డి కంబైన్డ్ వృషభరాజములు 4,868 అడుగులు లాగాయి. ఎద్దుల యజమానులకు దేవస్థాన కమిటీ నగదు బహుమతులను అందజేసింది.
హోరాహోరీగా బాస్కెట్బాల్ టోర్నీ
ఉత్తనూర్లో ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల్లో భాగంగా మంగళవారం ఫ్రీ క్వార్టర్, క్వార్టర్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. ఫ్రీ క్వార్టర్ ఫైనల్ పురుషుల విభాగంలో చిత్తూరు, మహబూబ్నగర్ జట్లు తలపడగా, 62-41 స్కోరుతో చిత్తూరు జట్టు గెలుపొందింది. కర్నూల్, ట్రినిటీ క్లబ్ పోటీ పడగా 65-61 స్కోరు సాధించి కర్నూల్ జట్టు గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో కేబీబీఆర్, సెంట్రల్ ట్యాక్స్ జట్లు తలపడగా 55-46 స్కోరుతో కేవీబీఆర్ జట్టు గెలుపొందగా, మరో మ్యాచ్లో అనంతపూర్, లయోలా అకాడమీ జట్లు తలపడగా, 60 -58 స్కోరుతో అనంతపూర్ జట్టు గెలుపొంది ఫైనల్కు చేరుకున్నది. అలాగే ఇన్కం ట్యాక్స్ హైదరాబాద్, కర్నూల్ జట్లు తలపడగా, 81-58 స్కోరుతో ఇన్కం ట్యాక్స్ జట్టు గెలుపొందింది. మహిళల విభాగంలో మొదటి సెమీ ఫైనల్లో సౌత్ సెంట్రల్ రైల్వే, మహబూబ్నగర్ జట్లు తలపడగా, 56-34 స్కోరుతో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు గెలుపొందింది. బుధవారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీబీఏ కార్యదర్శి నార్మన్ఇసాక్, కార్యదర్శి కొట్టం నీలిమ తెలిపారు.