రూ.13.50 లక్షలు సమకూర్చిన దాతలు
నాడు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలో నేడు సకల సదుపాయాలు
పూర్వ విద్యార్థి హెచ్ఎంగా రావడంతో మారిన రూపురేఖలు
కార్పొరేట్గా దీటుగా నిలిచిన వంగూరు పాఠశాల
వంగూరు, ఫిబ్రవరి 12: ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నది.. కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. విద్యార్థులు చదువుకునేందుకు ఏ మాత్రం అనువుగా లేదు. ఈ క్రమంలో అదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి చిమ్ముల శశాంక్రెడ్డి హెచ్ఎంగా వచ్చారు. స్కూల్ స్థితిని చూసి చలించిపోయారు.. తనతోపాటు చదువుకున్న వారు, గ్రామ పెద్దల సాయంతో రూ.13.50 లక్షలు పోగుచేశారు. పాఠశాలకు స్లాబ్ వేయించడంతోపాటు రెండు అదనపు గదులను నిర్మించారు. గోడలపై పెయింటింగ్ వేయించారు. ప్రహరీ చుట్టూ మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. దీంతో శిథిలావస్థలో ఉన్న వంగూరు ప్రాథమిక పాఠశాల నేడు సకల సౌకర్యాలతో ఆకట్టుకుంటున్నది. ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో మరిన్ని సదుపాయాలు కల్పించనున్నారు.. – వంగూరు, ఫిబ్రవరి 12
పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, హెచ్ఎం. శిథిలావస్థకు చేరిన పాఠశాలకు పూర్వ విద్యార్థి హెచ్ఎంగా వచ్చి కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను తీర్చిదిద్ది పలువురి ప్రశంసలు పొందాడు. వంగూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులు చదువుకునేందుకు ఏమాత్రం అనువుగా లేదు. అలాంటి పరిస్థితిలో ఇక్కడే చదువుకున్న మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి చిమ్ముల శశాంక్రెడ్డి హెచ్ఎంగా పాఠశాలకు బదిలీపై వచ్చారు. పాఠశాల అభివృద్ధికి సరిపడా నిధులు లేకపోవడంతో ఎలాగైనా పాఠశాలను అన్ని హంగులుతో కార్పొరేట్స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే పాఠశాలలో చదువుకొని ఉన్నతస్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులను, గ్రామపెద్దలను సాయం కోరారు. దీంతో వారి ద్వారా రూ.13.50లక్షలు విరాళాలు సమకూర్చారు. మొదటగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలపై స్లాబ్ వేశారు. ముందుగా డిజైన్ చేసిన రేకులు వేయించడంతోపాటు అదనంగా మరో రెండు తరగతి గదులను నిర్మించారు. అన్ని గదుల్లో లప్పం వేయించడంతో పాటు విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను గీయించారు. రూ.80వేలు వెచ్చించి మినీ ట్యాంకు నిర్మించారు. అదేవిధంగా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మించారు. ప్రహరీ గేటు వద్ద, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. దీంతో పాఠశాల స్వరూపం మారి కార్పొరేట్ పాఠశాలను మరిపించేలా ప్రభుత్వ పాఠశాల ఆకట్టుకుంటున్నది. దీంతో హెచ్ఎం శశాంక్రెడ్డిని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు పలువురు అభినందించారు.
సంతోషంగా ఉంది
చదువుకున్న పాఠశాలలోనే హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, పెద్దల సాయం మరువలేనిది. 34మంది విద్యార్థులు ఉన్న పాఠశాల నేడు 75మంది విద్యార్థుల స్థాయికి పెరిగింది. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మనబడి కింద మా పాఠశాలను చేర్చితే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది.
– చిమ్ముల శశాంక్రెడ్డి, హెచ్ఎం, ప్రాథమిక పాఠశాల, వంగూరు