జోగులాంబ గద్వాల : దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాలు అభివృద్ధి చెందాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ధరూర్ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్పంచ్ పద్మమ్మ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరుగక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు వెచ్చిస్తూ గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధితోపాటు..గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సబ్బండ వర్ణాలను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేస్తున్నాయని అన్నారు.
ఎవరి గ్రామాన్ని వారే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నజూమన్నీసా బేగం, జెడ్పీటీసీ పద్మ, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ పద్మ, మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు రఘు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.