గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు(Nettempadu) గ్రామంలో మొసళ్లు(Crocodiles )కలకలం రేపాయి. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న కుంటలో గత సంవత్సర క్రితం ఒక ముసలి చొరబడగా ఇప్పుడు దానితోపాటు మరో రెండు మొసళ్లు తీవ్రంగా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండడంతో అటుగా వెళ్లే ప్రజలు కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా మహిళలు, పురుషులు బహిర్భూమికి వెళ్లే దారిలో మొసళ్లు సంచరిస్తుండడంతో తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఆరు అడుగులకు పైగా ఉన్న మొసలి చేపను పట్టిన దృశ్యాలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసళ్లను బంధించాలని కాలనీవాసులు కోరుతున్నారు.