 
                                                            జోగులాంబ గద్వాల : దేశ సమగ్రతను కాపాడేందుకు అవిశ్రాంత కృషి చేసి ఉక్కు మనిషిగా పేరుగాంచిన దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ పిలుపునిచ్చారు. వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా గద్వాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి రైల్వే ఫ్లైఓవర్, అంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు తో పాటు ఇతర అతిథులు, పెద్ద ఎత్తున విద్యార్థులు 2కే రన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడేందుకు రన్ ఫర్ యూనిటీ దోహదపడుతుందన్నారు. మన దేశంలో భిన్న మతాలు, జాతులు, వివిధ భాషలు మాట్లాడే ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పలు రకాలుగా ఉన్నప్పటికీ వారి ఆచార, వ్యవహారాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూనే అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంగా జీవిస్తున్నామన్నారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలు భారత యూనియన్ లో కలిసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య భారతదేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
విద్యార్థులు మన దేశ గొప్పతనాన్ని తెలుసుకొని తమ భావి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకొని, దేశ సమగ్రతను కాపాడేందుకు సామాజిక స్పృహను అలవర్చుకోవాలన్నారు. అనంతరం ముఖ్య అతిథులు, కార్యక్రమానికి విచ్చేసిన వారందరితో పాటు విద్యార్థులచే ఐక్యత, డ్రగ్స్ నివారణ పై వేరువేరుగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, సిఐలు, ఎస్సైలు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
 
                            