జోగులాంబ గద్వాల : జిల్లాలో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఆధార్ ఆధారిత ఒటిపి ధ్రువీకరణ తప్పని సరి అని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. గద్వాల మండల పరిధిలోని తుర్కోనిపల్లి, ములకలపల్లి, తెలుగోని పల్లి, లత్తిపురం, బిరెల్లి, బసాపురం, అనంతపురం గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ రఘురాం శర్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండానిర్వాహకులు వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వడ్లు బాగా ఆరబెట్టి 17శాతం లోపు తేమ ఉండేలా చూడాలన్నారు. అదేవిధంగా రైతులు తమ దగ్గరలో ఉన్న పోస్టాఫీసు లేదా పోస్ట్ మ్యాన్ వద్దనే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే ధాన్యం కొనుగోలు సమయంలో సంబంధిత రైతు సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుందన్నారు.
కార్యక్రమంలో సర్పంచులు గీత, మన్నెమ్మ జయమ్మ, ఎంపీటీసీలు రాధ, అయ్యన్న, నాయకులు రమేష్ నాయుడు, జయరాం రెడ్డి, కురుమన్న, వెంకటరామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.