జోగులాంబ గద్వాల : జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి బ్యాంకర్లు రుణాలు అందించాలని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. గురువారం గద్వాల్ పట్టణంలోని హిమాలయ హోటల్లో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఏర్పాటు చేసిన బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొందరు వ్యాపారం వైపు దృష్టిసారిస్తారని, అలాంటి వారు బ్యాంకులు అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించాలని ఆమె సూచించారు. ఉపాధి యూనిట్ల ఏర్పాటు వల్ల ప్రజలు ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ఉపాధి పథంలో ముందుంటుందని, మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం 150 కోట్ల టార్గెట్ను రీచ్ అయ్యామని ఆమె తెలిపారు.
అనంతరం వివిధ బ్యాంకుల ద్వారా మంజూరైన 7 కోట్ల 10 లక్షల రూపాయల చెక్కును ఎస్ ఎచ్జీ మహిళా గ్రూపులకు అందజేశారు. వివిధ బ్యాంకులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్, రీజినల్ మేనేజర్ ఎస్బీఐ మధుబాబు, డీఆర్డీఏ ఉమాదేవి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.