జోగులాంబ గద్వాల : దళితబంధు అమలులో గద్వాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. గద్వాలలోని కేసీఆర్ స్టడీ సర్కిల్ సమావేశం హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై అవగాహన సదస్సును ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ బిజినెస్ అడ్వైజర్ విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శతాబ్దాలుగా దళితులు ఆర్థిక, సామాజిక అణచివేతకు గురయ్యారు. వారు ఆర్థిక పరిపుష్టి సాధించడమే కాకుండా ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరయ్యని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చిన పది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వ్యాపార సంస్థలు, చిన్న తరహా పరిశ్రమలు, రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి వారు ఆర్థికంగా ఎదుగాలని ఆకాక్షించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.