జోగులాంబ గద్వాల : జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించి వైద్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం ఏరియా దవాఖానలో ఐసీయూ, వయోవృద్ధుల ఫిజియోథెరపీ, జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్ , ప్రాణవాయుగది, మార్చురీ గదులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ విభాగాల సేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గద్వాల ప్రభుత్వ ఏరియా దవాఖానలో అన్ని రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఐసీయూ యూనిట్ వల్ల మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అలాగే వయోవృద్ధుల ఫిజియోథెరపీ, జిల్లా మెంటల్ క్లినిక్, ఆక్సిజన్ అందించేందుకు 60 సిలిండర్లు ఏర్పాటు చేసామన్నారు.
వీటిపై స్టాఫ్ నర్సులకు అవగాహన కలిపించాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా దవాఖాన లో రోగులకు ఎటువంటి సేవలు అందేవి కాదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా దవాఖానలో రోగులకు అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇప్పటికే తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా 134 రకాల ఉచిత పరీక్షలు రోగులకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దవాఖానలో ఐసీయూ వృద్ధులకు ఫిజియోథెరపీ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు.