జిల్లా దవాఖానలో మరిన్ని వైద్య సేవలు
రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ వైద్యం
అన్ని సేవలు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేబండ్ల
గద్వాల, జూలై 21: తెలంగాణ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభు త్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రస్తుతం రోగులు ప్రభుత్వ దవాఖానల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్య సేవలు అందించడంతోపాటు వారికి మందులు అందజేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందే గద్వాలలో ఉన్న దవాఖాన ఏరియా దవాఖానగా రోగులకు వైద్య సేవలు అందిస్తూ వచ్చింది. జిల్లాలు ఏర్పాటు కావడంతో ఏరియా దవాఖాన జిల్లా దవాఖానగా అభివృద్ధి చెందడంతోపాటు పడకలు, వైద్యసేవలు పెరిగాయి. జిల్లా దవాఖానగా రూపాంతరం చెందిన తర్వాత రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా సీమాంక్ కేంద్రం ఏర్పాటు చేసి అన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే తెలంగాణ డయాగ్నోస్టిక్ సెం టర్ ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు జిల్లా దవాఖానలో చేస్తున్నారు. క్యాన్సర్, బర్నింగ్ రోగుల కు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి..
జిల్లా దవాఖానలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉచిత చికిత్సలు అందించడంతోపాటు వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా దవాఖానలో నేషనల్ వైరల్హెపటైటీస్ కంట్రోల్ పోగ్రాం పేరుతో జిల్లా దవాఖానలో ప్రత్యేక క్లినిక్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఒక డాక్టర్తో పాటు ఇద్దరు నర్సులు, ల్యాబ్టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్తోపాటు ఫార్మసిస్ట్ను నియమించారు. ఇక్కడ లివర్ సమస్యలతో బాధపడేవారికి వైద్య సేవలు అందించి జబ్బు నయం అయ్యేవరకు మందులు ఉచితంగా ఇస్తున్నారు. అలాగే ఎవరైనా గుండె పోటు వచ్చి జిల్లా దవాఖానలో చేరితే వారికి తాత్కాలికంగా ఉపశమనం కలిగించడాని ఇంజక్షన్ చేయడంతోపాటు ప్రైవేట్ దవాఖానలకు రెఫర్ చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ దవాఖానకు తరలించి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. క్లినిక్ను గత నెల 29న ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు గుండెపోటుకు గురైన వారిని హైదరాబాద్కు తరలించి వారి ప్రాణాలు కాపాడారు. గుండె పోటుకు గురైన వారు ప్రైవేట్ దవాఖానల్లో చేరితే వారికి రూ.50వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. అలాగే వైరల్ హెపటైటీస్కు (లివర్కు సంబంధించి)ఆరు నెలలు ప్రైవేట్గా మందులు వాడితే రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. అటువంటిది జిల్లా దవాఖానలో వైద్యంతోపాటు వారికి ఉచితంగా మందులు అందిస్తున్నారు. జిల్లా దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్ ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడుతున్న వారికి ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు వారికి మందులు అందజేస్తున్నారు.
రోగులు సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం నాన్కమ్యూనికబుల్ డిసీసెస్ కోసం జిల్లా దవాఖాన ఆవరణలో నేషనల్ వైరల్ హెపటైటీస్ కంట్రోల్ పోగ్రాం పేరుతో ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇందులో వైరల్ లివర్ సమస్యలతో బాధపడేవారికి ఉచిత వైద్యం అందించడంతోపాటు మందులు అందజేస్తున్నాం. వీటితోపాటు గుండెపోటుకు గురైన వారు, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి ఈ సెంటర్లో మెరుగైన వైద్యంతోపాటు మందులు అందజేస్తున్నాం. రోగనిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా ప్రభుత్వ దవాఖానలో చేయించుకోవాలి. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని ఉచితంగా చేస్తారు దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
-డాక్టర్ చుక్కా పరశురాం