కలెక్టర్ శృతిఓఝా
గద్వాల, జూలై 31 : జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తిచేయాలని కలెక్టర్ శృతిఓఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు జిల్లాలో 715 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఓ కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో టెండర్ ఫైనల్ చేశామని అధికారులు బాధ్యతతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో టెండర్లు ఫైనల్ చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం నాణ్యతతో చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. టెండర్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తప్పనిసరిగా రోడ్డు సౌకర్యంతో పాటు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతి బిల్లుకు క్వాలిటీ సర్టిఫికెట్ ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రఘురాంశర్మ, నీటిపారుదల శాఖ అధికారులు శ్రీనివాసరావు, విజయ్ కుమార్రెడ్డి, పీఆర్ఈఈ సమత ఇతర అధికారులు భీమ్లానాయక్, భాస్కర్ పాల్గొన్నారు.