వనపర్తి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ): యాదవుల అభ్యున్నతికే గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 15లోగా జిల్లాలో పూర్తిచేస్తామన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార యూనియన్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చిత్తశుద్ధిలేని పార్టీలు గొర్రెల పంపిణీని విమర్శిస్తున్నాయని, వారి వ్యవహారం గొల్ల, కురుమల కులవృత్తిని కించపరిచేదిగా ఉందన్నారు. యాదవులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమన్నారు. అన్ని వర్గాలు ఉన్నతంగా జీవించాలని అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు. గొర్రెల పంపిణీ ద్వారా జీవనోపాధి దొరకడంతో పాటు ఉన్నతంగా జీవించే వీలుంటుందని, కష్టపడి పెంచుకుందామనుకున్న ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నారు. నిజాం నవాబు వారసులు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చేపట్టి గొప్ప ధనవంతులయ్యారని, భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా గొర్రెల కాపారిగా ఉన్నారని, ఇంత పవిత్రమైన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తమ కుటుంబానికి కూడా 200 గొర్రెలు ఉండేవని, యాదవులు మంచి మనసు, దానగుణం కలిగి ఉంటారన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్రీడింగ్ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన ఉంటుందన్నారు. మీట్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసుకుందామన్నారు. వారాంతపు సంతకు వనపర్తిలోని పాలశీతలీకరణ కేంద్రం పరిధిలోని మూడు ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు. సహకార యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒక వెటర్నరీ మెడకిల్ షాపును సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పశువుల వైద్యం కోసం వైద్యశాలలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆగస్టు 15లోగా సమీకృత కలెక్టరేట్
ఆగస్టు 15లోగా సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తి చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ యాస్మీన్ బాషాతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెడికల్ కళాళాల ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. 80ఫీట్ల రోడ్డుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్ వేణుగోపాల్, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, జిల్లా అటవీశాఖ అధికారి రామకృష్ణ, ఆర్అండ్బీ ఈఈ దాస్య నాయక్, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్రెడ్డి, సహకార యూనియన్ అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, డైరెక్టర్లు బాచుపల్లి యాదవ్, గోపాల దేవేందర్, పాల్గొన్నారు.
1000మంది దళితులు హాజరుకావాలి
వనపర్తి, ఆగస్టు4: 70 ఏండ్ల కాలంలో ప్రజలను కేవలం ఎన్నికల సమయంలో వారి ఓట్లను వినియోగించుకునేందుకు మాత్రమే ఉపయోగించుకున్నారే తప్పా ఏనాడైనా వారి జీవితాల గురించి ఆలోచన చేసిన సందర్భాలు లేవని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని దళితుల ముఖ్య నాయకులతో వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ఈనెల 16న హుజూరాబాద్లో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారని వనపర్తి నియోజకవర్గం నుంచి 1000మందికి తగ్గకుండా దళితులకు హాజరుకావాలన్నారు. వానకాలంలో రూ.7వేల 3వందల 60కోట్లు రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇందులో 5ఎకరాల్లోపు ఉన్న 97.5 శాతం మంది ఉన్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, రేవల్లి జెడ్పీటీసీ భీమయ్య, మాజీ ఎంపీపీ సేనాపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవికుమార్, నాయకులు విజయ్, పరంజ్యోతి, వెంకటేశ్, శరవంద, డానియల్ పాల్గొన్నారు.
సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలి
నిరుపేదలైన ముస్లిం మైనార్టీలు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 19మంది లబ్ధిదారులకు రూ.50వేల విలువ గల చెక్కులను అందజేశారు.