బాలబ్రహ్మేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ, అన్నాభిషేకం
అలంపూర్, ఫిబ్రవరి 13: జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఆరుధ్ర నక్షత్సాన్ని పురస్కరించుకొని అర్చకులు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఆరుద్రోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా అర్చకులు గోమాత సహిత ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో మూలవిరాట్కు పూలతో అలంకరించి, అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం క్రమం తప్పకుండా నిర్వహించడం మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, సకాలంలో వానలు కురిసి సకల సంపదలు సమకూరుతాయని పండితులు భక్తులకు వివరించారు. ఆరుద్రోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ప్రచార సూచిక బోర్డుల ముస్తాబు..
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అలంపూర్ జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు వచ్చే భక్తులు అతి సునాయసంగా వచ్చేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ప్రచార సూచిక బోర్డులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు నుంచి అలంపూర్ క్షేత్రం వరకు ప్రచార సూచిక బోర్డులకు రంగులు వేయడం, రూట్ మ్యాప్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్, రాయిచూర్ నుంచి అలంపూర్ క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సుస్వాగతం పలికే తాత్కాలిక ముఖద్వారాలను ఆలయ ఈవో పురేందర్కుమార్ నేతృత్వంలో రహదారి పొడవునా స్థలాలను సందర్శించారు. గతంలో కంటే ఈ ఏడాది మరింత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్శర్మ, సిబ్బంది ఉన్నారు.