గద్వాల: అక్టోబర్ 10 : కొత్త జిల్లాల ఏర్పాటు నవశకానికి నాంది పలికింది. జిల్లా ఏర్పాటై నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది. ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారి పేరిట జోగులాంబ గద్వాల ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా ఏర్పాటు కావడంతో నడిగడ్డ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. చిన్నజిల్లాలు ఏర్పాటు చేయడంతో అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పాలన సాగుతున్నది. గతంలో ప్రజలు వ్యయ ప్రయాసాలకోర్చి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు వెల్లి ఉన్నతాధికారులను కలిసి సమస్య విన్నవిస్తే తిరిగి కింది స్థాయి అధికారులకు విచారణ చేయమని ఆదేశిస్తుండడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రజలకు ఆ బాధలు తప్పాయి. జోగులాంబ గద్వాల జిల్లా 6,09,990 మంది జనాభా 2,928 కిలోమీటర్ల మేర విస్తీర్ణంతో 12 మండలాలు, 255 పంచాయతీలు, మూడు పోలీస్ సర్కిళ్లతో రూపాంతరం చెందింది. చిన్న జిల్లా
కావడం సుమారు 51శాఖల అధికారులు ప్రజలకు 50కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులకు తెలియజేసుకుని సమస్య పరిష్కరించుకునే వీలు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉండడంతో జిల్లా అన్ని రంగాల్లో వడివడిగా అభివృద్ధిలో అడుగులు వేయడానికి అవకాశం లభించింది. జిల్లా ఏర్పాటు, కలెక్టర్ పర్యవేక్షణతో వివిధ శాఖల్లో అవినీతి తగ్గిందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. జిల్లా కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టి అన్నిశాఖల జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
అభివృద్ధి వేగవంతం..
జిల్లా ఏర్పాటు తర్వాత నడిగడ్డ ప్రాంతం వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు పడ్డాయి. గురుకుల పాఠశాలలతోపాటు ఒక వేద పాఠశాల మంజూరైంది. పదో తరగతి వరకే ఉన్న కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టి విద్యాపరంగా వెనుక బడ్డ జిల్లాలో నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించింది. పేద విద్యార్థులు గ్రూప్-1, 2 కోచింగ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వం ఇక్కడే బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నది. గద్వాల ఏరియా దవాఖాన జిల్లా దవాఖానగా మారడంతోపాటు పడకలు పెరిగాయి. దీంతో పాటు డయాలసిస్ రో గుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పా టు, చిన్నపిల్లకు, బాలింతల కో సం ప్రత్యేక వార్డు, ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేశారు.
జిల్లా దవాఖానకు అనుబంధంగా ఇక్కడే 300పడకల దవాఖాన ఏర్పాటు, వైద్యకళాశాల నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అందుబాటులోకి వస్తే ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. సెంట్రల్ల్యాబ్ మంజూరైంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఇరిగేషన్ పరంగా జిల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు అడుగులు వే సింది.తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటుతో ఆర్డీఎస్ ద్వారా నీరు అందని పొలాలకు నీరు అందుతుండడంతో నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయడంతోపాటు గతంలో ఉన్న లిఫ్ట్లతో నడిగడ్డ ఇరిగేషన్ పరంగా అభివృద్ధి చెంది సుమారు 2లక్షల ఎకరాలకు పైనే నీరు అందేఅవకాశం ఏర్పడింది.
పారదర్శక పాలన సాగుతున్నది..
జిల్లా ఏర్పాటుకు పూర్వం ప్రజలు అధికారులను కలిసేందుకు అనేక ఇబ్బందులు పడేవారు. కలెక్టర్కు సమస్య చెప్పుకోవాలంటే మహబూబ్నగర్కు వెళ్లాల్సి వచ్చేది. జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం ప్రజల దగ్గరకు పాలన తీసుకొచ్చింది. పనులు వేగవంతంగా జరగడానికి అవకాశం ఏర్పడింది. అవినీతి తగ్గి ప్రజలకు పాలన మెరుగైంది.
– ఆనంద్, తెలంగాణ నాన్గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి
ప్రజల చెంతకు పాలన..
జిల్లాల ఏర్పాటు పేదలకు ఎంతో మేలు చేసింది. అర్హులైనా ప్రతిఒక్కరికీ సంక్షేమపథకాలు పారదర్శకంగా అందడానికి అవకాశం ఏర్పడింది. గతంలో ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మహబూబ్నగర్ ఉన్న కలెక్టర్కు వెళ్లాల్సి వచ్చేది. జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు కలెక్టర్తోపాటు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఏర్పడింది.
– నరసింహ, గద్వాల జిల్లా