జడ్చర్ల టౌన్, అక్టోబర్ 2 : జడ్చర్ల మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రూ.3 కోట్ల నిధులతో ప్రస్తుత పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులన్నీ మెరుగు పడ్డాయన్నారు. అలాగే పార్కులు, మినీ ట్యాంకుబండ్లు నిర్మించినట్లు తెలిపారు. రూ.కోట్లాది నిధులతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. మున్సిపల్ కార్యాలయ భవనం పనులను త్వరగా.. నాణ్యతగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. త్వరలోనే తాసీల్దార్, భూసార పరీక్ష కేంద్రాల కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన నిధులను మంజూరు చేయించి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
టైలరింగ్, మగ్గం వర్క్ శిక్షణ ప్రారంభం
ఇందిరానగర్ కాలనీలో చేయూత రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్, మగ్గం వర్క్ శిక్షణా శిబిరాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నైపుణ్యత పెంపొందించుకొని మరికొందరికి జీవనోపాధి కల్పించాలని కోరారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే కుటుంబాలు బాగుపడ్తాయని, ఈ క్రమంలో మహిళలందరూ స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ట్రస్ట్ అధ్యక్షురాలు మార్తా డేవిడ్, మహిళలు పాల్గొన్నారు.