కుమ్మెర జాతరలో బహుజన బిడ్డ తన మొక్కు చెల్లించుకునేందుకు పోతే అధికార అహంకారంతో స్థానిక సర్పంచ్ అనుచరులు దర్శనానికి వెళ్లిన చంద్రకళను దుర్భాషలాడి ఆమెపై దాడి చేయడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. తీవ్ర పదజాలంతో దూషిస్తే ప్రశ్నించిన కొడుకు గణేశ్ను టెంకాయల గదిలో వేసి పది మందికిపైగా దాడి చేశారన్నారు. నా జాతిని తిట్టారని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తిరిగి గణేశ్పై అధికారం దాహంతో మరోసారి పిలిపించి విచక్షణా రహితంగా దాడి చేశారన్నారు. తన భర్తను వదిలేయాలని భార్య మౌనిక ప్రాధేయపడినా పట్టించుకోకుండా ఆమె దాడి చేయడంతో ఆమె ఒడిలో ఉన్న పసికందు కిందపడి చికిత్స పొందుతూ మృతి చెందిదన్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేసు పెట్టకుండా ప్రజాప్రతినిధులకు తలొగ్గి ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు పెట్టిన పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అంతకుముందు బాధిత కుటుంబాన్ని ధర్నా శిబిరానికి రానివ్వడం లేదని తెలియడంతో మర్రి పోలీసులపై మండిపడ్డారు. బాధితులు శిబిరం వద్దకు రాకపోతే రేపటి నుంచి కందనూలులో డీఎస్పీ కనిపించడని హెచ్చరించారు. దాడి జరిగిన సమయంలో ఉన్న సీసీ కెమెరాలు దాడి అనంతరం కనిపించలేదని, మీ తప్పే లేనప్పుడు ఎందుకు తీసేశారని ప్రశ్నించారు.
ఫిర్యాదు చేయడానికి వెళ్తే కాంగ్రెస్ నాయకులకు కొమ్ముకాస్తూ కేసు పెట్టకుండా కాంగ్రెస్ నాయకులతో ఫిర్యాదు తీసుకొని బాధితులపైనే కౌంటర్ కేసు పెట్టిన ఘనుడు మన సీఐ అన్నారు. ఇంతలో గాయపడిన పసిబిడ్డ చనిపోయే సరికి కేసు పెట్టలేదని తమపై నిందవస్తున్న కారణంతో కోర్టు సలహాకోసం పంపినమంటూ కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేద్దామని కేటీఆర్ వస్తే దాచిపెట్టడం సిగ్గుచేటని, ఇదేనా మీరు కొనసాగిస్తున్న ప్రజాపాలన అని ప్రశ్నించారు. బహుజన బిడ్డలు కేసు పెడితే కోర్టు సాకు చెప్పిన పోలీసులు అదే అధికార పార్టీ నాయకులు కేసు పెడితే వెంటనే బాధిత కుటుంబంపై కేసు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈ విషయంపై ప్రశ్నిస్తే డీఎస్పీ వద్ద సమాధానం లేదని, మిన్నకుండిపోయి నీళ్లు నములుతున్నాడని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరుఫున పోరాటం చేయాలని సూచించినట్లు చెప్పారు. బహుజన కుటుంబానికి అన్యాయం జరిగితే జెండాను పక్కన పెట్టి అందరూ ఏకమైనా ప్రభుత్వంలో కానీ, పోలీసులలో కానీ చలనం లేదన్నారు. నిందితులపై మర్డర్కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తాము పోలీసులతో కొట్లాడుతుంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నుంచి ఫోన్లు వస్తున్నాయని, ఎంపీ కూడా ఫోన్ చేసి కేసు చూసి చేయాలని సలహాలు ఇచ్చాడని, ఇలాగైతే ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
ఘటనకు కారకులైన కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేసి 301 సెక్షన్ నమోదు చేసి శిక్షపడేలా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేతో మాట్లాడించడం సిగ్గుచేటన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగినా.. నిరసనలు చేసినా పట్టించుకోకుండా నా ఇంట్లో రెండు పదవులు ఉన్నాయనే అహంకారంతో కార్యకర్తలకు కొమ్ముకాస్తూ బహుజనులకు అన్యాయం చేస్తున్నారన్నారు.
నాగర్కర్నూల్లో ప్రజాపాలన అంటూ పోలీసుల పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి న్యాయం చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని, అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నా మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదని, అత్యుత్సాహం చూపిన పోలీసులను వదిలిపెట్టమని, పింక్ బుక్లో రాసుకుంటామని, అధికారంలో వచ్చిన తర్వాత అంతు చూస్తామని హెచ్చరించారు. అత్యుత్సాహం చూపిన పోలీసులు భూమ్మీద ఉంటే మాత్రం వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.