దేవరకద్ర రూరల్(చిన్న చింతకుంట), ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం దొరుకుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం చిన్నచింతకుంటలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఎంపీ మన్నె, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి శ్రీనివాస్గౌడ్ హాజరై మాట్లాడారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ప్రజలు ఎంతో తెలివైన వారని, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. స్థానికుడైన మన్నె శ్రీనివాస్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ హయాంలో సభలలో హుందాగా వ్యవహరించేవారని, ఇప్పుడున్న సీఎంకు అవేవీ తెలియదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే మరోసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రె స్ ప్రయత్నిస్తున్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పుచేశామని ప్రజలు బాధపడుతున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలువబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందన్నారు. కేంద్రం పదేండ్లలో తెలంగాణకు ఏ మాత్రం సాయం చేయలేదన్నారు. ప్రజలకు కేసీఆర్పై పూర్తి భరోసా ఉన్నదన్నారు. కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ బలపర్చిన మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, అంజయ్యయాదవ్, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాము, నాయకులు తదితరులు పాల్గొన్నారు.