మహబూబ్నగర్ అర్బన్, జూలై 19 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టు సాధన జేఏసీ అధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు చెరువులు నింపి సాగు విస్తీర్ణాన్ని పెంచామన్నారు.
గతంలో రెండు లక్షల ఎకరాలకు సాగు ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తుచేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కలిసికట్టుగా పోరాటం చేద్దామన్నారు. మహబూబ్నగర్లో 14రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవని, మిష న్ భగీరథ ద్వారా ప్రతిరోజూ నీళ్లిచ్చామన్నారు. గతంలో రైతులు పంటలు పండించాలంటే మోటర్లు ఉపయోగించేవారని మా ప్రభుత్వంలో కృష్ణానది నీటిని పట్టణం, తండాలకు అందించామన్నారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యం 11 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 6, 7 టీఎంసీల నీరు మాత్రమే ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే వరదలు వచ్చిన నీటితో 40రోజుల్లో 60 టీఎంసీలతో రిజర్వాయర్లను నింపుకొనే సామర్థ్యం కలిగిన మోటర్లు ప్రా జెక్టులో ఉంచామని, పది శాతం పనులు పూర్తి చేస్తే 12లక్షల 32వేల ఎకరాలకు నీరు వస్తుందన్నారు.
టెండర్లు పిలిస్తే వాటిని రద్దు చేశారు. ఈ బడ్జెట్లోనైనా నిధులు తెచ్చుకొని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సాగునీరు దక్కకుండా చేసేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ప్రయ త్నం చేస్తున్నాయని, ఆర్డీఎస్ నుంచి అక్రమంగా నీరు తరలించేందుకు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్మట్టి వద్ద 300 టీఎంసీల నీరు నిలుపుకొనేందుకు ఎత్తును పెంచుతున్నారన్నారు. దీని అడ్డుకునేందుకు న్యాయపరంగా ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణకు నీళ్లు ఇవ్వద్దని పనిచేసిన ఆంధ్రా అధికారిని సలహదారుగా నియమించారని ఆంధ్రాకు మేలు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు ఉన్నారు.