మక్తల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని ( Chittem Rammohan Reddy ) మక్తల్ సీఐ, రామ్ లాల్ హౌస్ అరెస్టు( House Arrest ) చేశారు. ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం మక్తల్ పర్యటనలో భాగంగా ప్రాజెక్టుల పరిశీలనతోపాటు, కృష్ణా నదిపై తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల సహకారంతో, రోడ్ కం బ్యారేజీల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు ఏరియల్ సర్వే కోసం మక్తల్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను మక్తల్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు.
మక్తల్ బీమా ప్రాజెక్టు ఫేస్ వన్ లో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించే ప్రక్రియలో రేవంత్ రెడ్డికి కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించే బీమా ప్రాజెక్టుపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి అతనితో పాటు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని అన్నారు. పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తుగానే హౌస్ అరెస్టు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తే మక్తల్ నియోజకవర్గం లో నర్వ, ఆత్మకూర్, అమరచిత మండలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.