Congress | టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవరికి వారే.. యమునా తీరే’.. అన్న చందం గా నేతల తీరు తయారైంది. ఒకే నియోజకవర్గంలో పో టాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీలో మకాం వేసి టికెట్ల కోసం పైరవీ లు చేస్తున్నారు. ఈ క్రమంలో బలమైన పోటీ ఉన్న నేతల కు గాలం వేస్తున్నారు. ఇలాంటి వారికి పార్టీలోని కొంద రు పెద్దలు నయానో.. బయానో ఆశచూపి పోరు నుంచితప్పిస్తున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొల్లాపూర్, నాగర్కర్నూల్, జడ్చర్ల, మక్తల్ స్థానాలకుభారీ డీల్ కుదిరినట్లు సమాచారం. దీంతో నాడుపోటీ విషయంలో రాజీ పడేది లేదని తెగేసి చెప్పిననేతలంతా నేడు అధిష్టానం మాటకు జై కొడతామనిప్రకటిస్తుండడం కొసమెరుపు. ‘హస్త’వాసి ఎవరికో.. అన్న టెన్షన్లో ఆశావహులు ఉంటే పార్టీ శ్రేణులుమాత్రం అయోమయంలో పడ్డారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల డీల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి పోటీలో నిలబడాలని భావిస్తున్న కొందరు నేతలు టికెట్లను కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్టీలో తమకు బలమైన పోటీ ఉన్న నేతలకు గాలం వేస్తున్నట్లు గుసగుసలు. ఇదంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ డైరెక్షన్లోనే జరుగుతుందని టికెట్లు గల్లంతవుతున్న ఓ వర్గం ఆరోపణలు.
ఉమ్మడి జిల్లాలో కొల్లాపూర్, నాగర్కర్నూల్, జడ్చర్ల, మక్తల్ స్థానాల్లో టికెట్ల కోసం కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల హడావుడి ప్రారంభం కాగానే తమదైన శైలిలో కార్యక్రమాలు చేపడుతూ ఎవరికి వారే పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో దేవరకద్రకు చెందిన ఓ నేత టికెట్ కావాలంటే ఎంత డిపాజిట్ చేయాలో చెప్పాలని నిలదీయడంతో డీల్ జరుగుతున్నట్లు వెల్లడైంది. తాజాగా నియోజకవర్గంలో నాకే టికెట్ వస్తది.. రూ.50 కోట్లు ఖర్చు పెట్టయినా సరే ఓడిస్తానని ఓ నేత శపథం చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
నేను సీనియర్ను.. నన్ను కాదని టికెట్ ఎవరికీ రాదన్న బీరాలు పలికిన మరో సీనియర్ నేత ఇప్పుడు మాట మార్చారు. నేను బీసీని.. ఈసారి టికెట్ నాదే.. అని పోటాపోటీగా నిన్నటి వరకు ఆర్భాటం చేసిన ఇంకో నేత అధిష్టానం ఎక్కడ పోటా చేయమన్నా చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్లో టికెట్ కోసం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఏకంగా పార్టీ మారడం వెనుక పెద్ద డీలే ఉన్నదని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. నిన్నటి వరకు ఉప్పు.. నిప్పులా ఉన్న నేతలు ఇప్పుడు సైలెంట్ కావడం ఈ ఆరోపణలకు బలం చేకురుస్తున్నది. సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చి బీఆర్ఎస్ ముందుకు దూసుకుపోతుంటే.. టికెట్లు దక్కుతాయా..? లేదా అన్న టెన్షన్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. జాబితా అంతా ఢిల్లీకి సమర్పించడంతో నేతలంతా అక్కడికి తరలివెళ్లి మాకే టికెట్ అంటూ కార్యకర్తలకు ఉదర
గొడ్తున్నారు. ఎట్టకేలకు వనపర్తి టికెట్ మాజీ మంత్రికే కేటాయిస్తున్నట్లు అధిష్టానం క్లియర్ చేసేసింది. మిగతా 11 నియోజకవకర్గాల్లో మాత్రం ఇంకా టికెట్ల అనిశ్చితి కొనసాగుతున్నది. ఇదిలాఉండగా ఇతర పార్టీల నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తుండటంతో ఇన్నాళ్లు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో నాలుగు స్థానాల్లో టికెట్లు దక్కించుకునేందుకు భారీ ఎత్తున డీల్ కుదిరినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పోటాపోటీగా ఉన్న నేతలను సైలెంట్ చేసేందుకు మాజీ ఎంపీ ఒకరు రంగంలో దిగి వ్యవహారాలు చక్కబెట్టినట్లు పార్టీ కార్యకర్తలు అంటున్నారు. దీంతో నిన్న, మొన్నటి వరకు నాకంటే.. నాకు.. టికెట్ వస్తుందనుకున్న నేతలంతా మౌనరాగం వహించడం ఇందుకు బలం చేకురుస్తున్నది. అంతేకాక తమ అనుచరులతో టికెట్లు ఇస్తేనే పోటీ చేద్దామని చెబుతున్నారు. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక హస్తం పార్టీలో చేరారు. ఆయన రాకను వ్యతిరేకించిన జగదీశ్వర్రావు అప్పట్లో రూ.50 కోట్లు వెచ్చించైనా సరే ఓడిస్తానని శపథం చేశారు.
తీరా ఇటీవల ఓ పార్టీ సమావేశంలో జుపల్లితో కలిసి వేదిక పంచుకుని టికెట్ ఎవరికి ఇచ్చినా చేస్తామని ప్రకటించారు. కాగా జూపల్లి పోకడలు నచ్చక రంగినేని అభిలాష్రావు కారెక్కి హస్తం పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. జడ్చర్లలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ప్రధాన అనుచరుడైన అనిరుధ్రెడ్డి టికెట్ కోసం ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పాలమూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎర్రశేఖర్ పార్టీలు మారి.. మారి.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. జడ్చర్లలో ఏకంగా ఇల్లుకట్టి గృహప్రవేశం చేసి తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేపట్టారు. చివరకు ఏమైందో ఏమో కానీ అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని ప్రకటించడం గమనార్హం. ఈ ఇద్దరు కలిసి ఓ మండల కేంద్రంలో కలిసి తిరగడంతో కార్యకర్తలే ఖంగుతిన్నారు.
నాగర్కర్నూల్లో టికెట్ తనకే వస్తుందని సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి అనుకుంటున్న తరుణంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి పార్టీలో చేరారు. దీంతో నాగం వర్గీయుల్లో అయోమయం నెలకొన్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. చివరకు కాస్తా టికెట్ ఎవరికి వచ్చినా ఫర్వాలేదంటూ కాంప్రమైజ్ అవ్వగా.. విస్తుపోవడం కార్యకర్తల వంతైంది. మక్తల్లో తనకే టికెట్ వస్తుందని వాకిటి శ్రీహరి ప్రచారం చేసుకుంటున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే సీతమ్మ సడన్గా కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు. గద్వాలలో జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య కూడా చేరడంతో ఈ నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వాళ్ల సీన్ రివర్స్ అయ్యింది. మహబూబ్నగర్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర నేత ఎన్పీ వెంకటేశ్ కాంగ్రెస్లో చేరడంతో ఇక్కడ టికెట్లు ఆశిస్తున్న వారికి నిరాశే మిగిలింది.
కాంగ్రెస్ రాజకీయం పట్నం నుంచి ఢిల్లీకి మారడంతో టికెట్లు ఆశిస్తున్న వారంతా అక్కడ మకాం వేశారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా టికెట్ల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. ఇలా అయితే బీఆర్ఎస్ను ఎలా ఢీకొంటామని ప్రశ్నిస్తున్నారు. చివరి నిమిషంలో పార్టీలో ఉండి పనిచేసిన వాళ్లను కాదని ఎవరికి పడితే వాళ్లకు టికెట్లు ఇస్తే ఎలా అని నీలదీస్తున్నారు. టికెట్ల ప్రక్రియ గందరగోళానికి దారి తీయడంతో కార్యకర్తలు ఎవరికి జై కొట్టాలో తెలియక తికమక పడ్తున్నారు. కాగా పార్టీలో టికెట్లు ఆశించిన వారికి, ఆశిస్తూ వచ్చిన వారికి ఆశాభంగం తప్పదని, ఇదంతా బీఆర్ఎస్కే లాభం చేకురుతుందని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.