మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 21 : కార్మిక సంఘాలకు అండగా నిలుస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం లో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక సంఘాల ఆ త్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులను ఎవరూ పట్టించుకోలేదని, తెలంగాణ ఏర్పడ్డాక వారికి మంచిరోజులు వచ్చాయన్నారు. మున్సిపాలిటీ, దవాఖానల్లో పనిచేసే కార్మికులకు రూ.2 వేల నుంచి రూ.12 వేలకు జీతం పెంచామన్నారు. వారు గౌరవంగా బతికేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు గతంలో సమావేశాలు రోడ్లపైనే నిర్వహించేవారని, కానీ నేడు అద్భుతంగా భవనాలను నిర్మించామన్నారు. కార్మికులందరినీ సంఘటితం చేయాలని, ఆపదలో ఉంటే ఆదుకునే బాధ్యత తీసుకొని వారికి అండగా నిలవాలని నాయకులకు సూచించారు. జిల్లాలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రూ.2.33 కోట్లు, సాధారణ మరణానికి రూ.2.45 కోట్లు అందించామన్నారు.
జిల్లాలో 54 రకాల కార్మిక శాఖలు ఉన్నాయని, వారందరూ పథకాలతో లబ్ధి పొందుతున్నారన్నారు. కార్మికుల పిల్లలకు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. పాలమూరు జిల్లా దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో బడ్జెట్ హోటల్తో పాటు బ్రాండెడ్ షాపింగ్మాల్స్, ఐమాక్స్ థియేటర్ను ఏడాదిలోగా అందుబాటులో తీసుకొస్తామన్నారు. వ్యాపారాలు అభివృద్ధి చెంది వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. సూపర్స్పెషాలిటీ దవాఖాన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. బస్టాండ్ నుంచి దవాఖాన వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. మినీ శిల్పారామం పనులు త్వరలోనే పూర్తవుతాయన్నారు. మన్యంకొండలో రూ.15 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు వారంలోగా టెండర్లు పిలుస్తామన్నారు. మే 6న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐటీ టవర్ నుంచి మహబూబ్నగర్ వరకు 100 ఫీట్ల రహదారి నిర్మిస్తామన్నారు. గతంలో కంటే అధిక జీతం తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని దవాఖానలో పనిచేస్తున్న కార్మికురాలు రజీయాబేగం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, బీఆర్ఎస్కేవీ ప్రధాన కార్యదర్శి విఠల్రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు రాములు, నరేందర్, రామలింగం, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.