గద్వాల, జూలై 7 : జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. సోమవారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1.12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 12 గేట్లు ఎత్తి దిగువకు 79,200 క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 29, 159 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా భీమా లిఫ్ట్-1కు 1300, కోయిల్సాగర్కు 315, జూరాల ప్రధాన ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 285, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,12,000 వేల క్యూ సెక్కులకు గానూ అవుట్ ఫ్లో మొత్తం 1,10,852 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.316 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
శ్రీశైలం, జూలై 7 : శ్రీశైల జలాశయం వరద నీటితో నిండుకుండలా మారింది. జలాశయానికి సోమవారం ఎగువ నుంచి 1,67,669 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్కు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.80 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 192. 5300 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 67,433 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీరు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అయిజ, జూలై 7 : కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు కర్ణాటకలోని హోస్పేట్లోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాం 19 క్రస్ట్ గేట్లు 2.5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు 58,334 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం టీబీ డ్యాం ఇన్ఫ్లో 52,498 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 61,760 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 76.450 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. టీబీ డ్యాం గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయడంతో ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి ప్రవాహం పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 61,190 క్యూసెక్కులు ఉండ గా, ప్రధాన కాల్వకు 595 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్కు 60,595 క్యూసెక్కులు చేరుతున్నాయి.
రాజోళి, జూలై 7 : తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి 57 వేల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టులోని 15 గేట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు అవుట్ఫ్లో 57,310 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ మహేంద్రారెడ్డి తెలిపారు. సామర్థ్యం 292.00 మీటర్లు ఉండగా ప్రస్తుతం 290.50 మీటర్లు నిల్వ ఉన్నది.