అయిజ, జూన్ 12 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. గురువారం జూరాలకు ఇన్ఫ్లో 14,500 క్యూసెక్కులు నమోదు కాగా నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం 1,500, కోయిల్సాగర్ లిఫ్టుకు 315, విద్యుత్ ఉత్పత్తికి 7,469 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అవుట్ ఫ్లో 9,352 క్యూసెక్కులు నమోదైంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుతం 318.070 ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 8.750 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కర్ణాటకలో కురుస్తున్న మోస్తరు వానలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. టీబీ డ్యాంకు ఇన్ఫ్లో 6,180 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 96 క్యూసెక్కులు నమోదైంది.
గరిష్ఠనీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1602.47 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 24.886 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతోంది. ఇన్ఫ్లో 4,329 క్యూసెక్కులు ఉండగా, దిగువన ఉన్న సుంకేసుల బారాజ్కు 3,879 క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 450 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 8.6 అడుగుల మేర నీటి మట్టం ఉంది.