అమరచింత, ఆగస్టు 6 : జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కాస్తా తగ్గింది. శనివారం ప్రాజెక్టుకు 67, 900క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అధికారులు డ్యాం 8 స్పిల్వే గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 41,191క్యూసెక్కులు, కుడి కాల్వకు 536, ఎడమ కాల్వకు 1,060, సమాంతర కాల్వకు 750క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 76,715క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
టీబీ డ్యాంకు స్థిరంగా..
అయిజ, ఆగస్టు 6 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ఫ్లో 62,411 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 73,437 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో అధికారులు 28 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 101.974 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1632.05 అడుగులకు చేరిందని డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు వరద వచ్చి చేరుతున్నది. తుంగభద్ర డ్యాం గేట్లు తెరవడంతో ఇన్ఫ్లో 61,190 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 60,700 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 490 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 11.5 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
బీచుపల్లి పుష్కరఘాట్ను తాకిన కృష్ణమ్మ
ఇటిక్యాల, ఆగస్టు 6: జూరాల గేట్ల నుంచి వరద నీరు విడుదల కావడంతో బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద ఏడు వరుసల మెట్లను ముంచెత్తి శివాలయం మర్రిచెట్టు వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదిలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పుష్కరఘాట్ వద్ద తాళ్లతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పుష్కరఘాట్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. భక్తులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లకుండా ఇటిక్యాల పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు.
శ్రీశైలం రెండు గేట్ల నుంచి..
శ్రీశైలం, ఆగస్టు 6 : శ్రీశైలానికి వరద కొనసాగుతున్నది. జలాశయం రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 26,496 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి నుంచి 42,328 క్యూసెక్కులు, సుంకేశుల డ్యాం నుంచి 72,114 క్యూసెక్కులు మొత్తం కలిపి 1,45,938 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో రిజర్వాయర్కు 1,82,640 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.70 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు ఉండగా.. 213.8824 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. స్పిల్వే నుంచి 55, 874 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 31,710 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కులు.. మొత్తం 1,19,368 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైంది. ఏపీ పవర్హౌస్లో 16.450 మిలియన్ యూనిట్లు, టీఎస్ పవర్హౌస్లో 17.433 మిలియన్ యూనిట్లు విద్యుదుత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు.