మహబూబ్నగర్, మే 16 : మత్స్యకారుల జీవితాల్లో ప్రభుత్వం నిరంతరం వెలుగులు నింపుతున్నది. వేసవిలోనూ చెరువులను నిండుకుండల్లా నింపి నిరంతరం మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నది. అదేవిధంగా పలు పథకాలను అందిస్తూ వారికి చేయూతనిస్తున్నది. ప్రత్యేక రాయితీల ద్వారా మత్య్సపరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
214 మత్స్యసహకార సంఘాలు
జిల్లావ్యాప్తంగా 194 మత్స్యసహకార, 20 మహిళా మత్స్యసహకార సంఘాలున్నాయి. వీటిలో 12,079మంది సభ్యులుగా ఉన్నారు. జీవనోపాధిని పెంపొందించేందుకుగానూ రెండు దశల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి సభ్యత్వం కల్పించారు. కాగా 27 నూతన సహకార సంఘాలు, 1,641మందికి వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించి నూతన సభ్యత్వం కల్పిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ సభ్యత్వం ఉన్న ప్రతి మత్య్సకారుడికీ రూ.5లక్షల ప్రమాదబీమా అందించేందుకుగానూ ప్రీమియం చెల్లిస్తున్న విషయం విదితమే. 2017లో సమీకృత అభివృద్ధి పథకం ద్వారా 75శాతం సబ్సిడీతో బైక్, నాలుగు చక్రాల వాహనాలు, ఇతర పనిముట్లను మత్స్యకారులకు అందించారు. నీలివిప్లవం పథకం ద్వారా వివిధ అంశాల్లో రాయితీలు కూడా అందిస్తున్నారు. మహిళలకు ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది.
రాయితీలు ఇలా..
చేపల చెరువు నిర్మాణానికి రూ.7లక్షలు, చేప విత్తన తయారీ కేంద్రానికి రూ.25లక్షలు, రిస్కర్యూ లేటరీ అక్వాకల్చర్కు రూ.50లక్షలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 25శాతం, ఇతరులకు 20శాతం సబ్సిడీ అందనున్నది. ఇన్సులేటెడ్ వాహనాలకు రూ.20లక్షలు, త్రిచక్ర వాహనాలకు రూ.3లక్షలు, సంచార చేపల విక్రయ వాహనానికి రూ.10లక్షలు, బతికున్న చేపల విక్రయంకేంద్రం ఏర్పాటుకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు, చేపల ఐస్ ఫ్యాక్టరీలకు రూ.30లక్షలు, చేపల మేత తయారీ కేంద్రానికి రూ. 30లక్షలు, మండలకేంద్రంలో చేపల మార్కెట్ నిర్మాణానికి రూ.15లక్షలను రాయితీగా అందిస్తున్నది.
ఎంపిక విధానం ఇలా..
జిల్లాలోని ఔత్సాహికులు, వ్యాపారస్తులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని జిల్లాస్థాయి క మిటీ పరిశీలించి అర్హత ఉన్న దరఖాస్తులను రాష్ట్రస్థాయి ఎంపిక కమిటీ ఎస్ఎల్సీకి పంపుతారు.
గతేడాది 1,017 చెరువుల్లో..
గతేడాది 1,017 చెరువుల్లో 184.5 లక్షల చేపపిల్లలను వదిలారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి 1,094 చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడా ది మరో 74 చెరువులను గుర్తిం చారు. ప్రతి చెరువులోనూ చేపపిల్లలను వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
1,094 చెరువుల్లో 193లక్షల చేపపిల్లలను వదిలేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా మత్స్యకారుల నుంచి వివరాలు తీసుకున్నాం. విడుతల వారీగా చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
-రాధారోహిణి, మత్స్యశాఖ జిల్లా అధికారి, మహబూబ్నగర్